హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ఈసారి దీపావళి ముందే వచ్చింది. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డీఏల్లో మూడింటిని, పాత డీఏ బకాయిలను ఇవ్వనున్నట్టు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఇందుకోసం మొత్తంగా రూ.35 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. శుక్రవారం ఆయన సంస్థ ఎండీ సజ్జనార్తో కలిసి బస్భవన్లో విలేకర్లతో మాట్లాడారు. నష్టాల నుంచి టీఎస్ ఆర్టీసీ క్రమంగా కోలుకొంటున్నందున ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఇటీవల సీఎం కేసీఆర్తో చర్చించామన్నారు. సీఎంతోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్ సూచనల మేరకు పలు సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ మానవీయకోణంలో ఆలోచించి రాష్ట్ర బడ్జెట్ నుంచి టీఎస్ ఆర్టీసీకి ఏటా రూ.1,500 కోట్లు కేటాయిస్తున్నారని, ఇలా ప్రభుత్వం నుంచి రోజుకు రూ.4 కోట్ల మేర సాయం అందుతున్నదని తెలిపారు. దీనితోపాటు ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీకి రోజువారీగా రూ.14-15 కోట్ల ఆదాయం వస్తున్నదని, అయినప్పటికీ సంస్థకు రోజూ రూ.4-5 కోట్ల నష్టం తప్పడంలేదని చెప్పారు.
ఎన్నికల కోడ్ వల్లే పీఆర్సీ ఆలస్యం
పీఆర్సీని ప్రకటించేందుకు మునుగోడు ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉన్నదని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. దీనిపై అనుమతి కోరుతూ ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు వెల్లడించారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించడంపై సీఎం కేసీఆర్తో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామన్నారు. 2020 నాటికి మెచ్యూర్ అయిన బాండ్లపై కార్మికులకు వడ్డీ చెల్లించే అంశం కూడా పరిశీలనలో ఉన్నదని, సీఎస్, పీఎఫ్ సహా అన్ని బకాయిల చెల్లింపు అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. నవంబర్ చివరి నాటికి 1,150 కొత్త బస్సులను అందుబాటులోకి తేనున్నామని, వీటిలో 360 ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలో కొన్ని డిపోలను మూసివేయనున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీని బతికించాలన్నదే సీఎం కేసీఆర్ తపన
టీఎస్ ఆర్టీసీని బతికించాలన్నదే సీఎం కేసీఆర్ తపన అని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ స్థానిక ప్రభుత్వాలు ఆర్టీసీలను ఆదుకోవడం లేదని, తెలంగాణలో మాత్రమే ఆర్టీసీకి ప్రభుత్వం అండగా ఉన్నదని చెప్పారు. కార్పొరేషన్లు ప్రైవేటుకు విక్రయిస్తే రూ.2 వేల కోట్ల వరకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రాష్ట్రంలోని 49 వేల మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఆర్టీసీకి అన్నివిధాలా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు.