హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గతం కంటే సౌకర్యాలు మెరుగుపడటంతో విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల వైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో కొన్ని కాలేజీల్లో సీట్లకు మించి అడ్మిషన్లు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 42,543 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 34,208 మంది జనరల్ కోర్సుల్లో, మరో 8,335 మంది ఒకేషనల్ కోర్సుల్లో చేరారు. హైదరాబాద్లోని ఫలక్నుమా, కూకట్పల్లి, మారేడుపల్లి కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండాయి. అయినా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతుండటం, సెప్టెంబర్ వరకు గడువు ఉండటంతో మొత్తం అడ్మిషన్ల సంఖ్య లక్ష వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్కర్నూల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగింది. తెలుగు కంటే ఇంగ్లిష్ మీడియంలోనే అత్యధికులు చేరుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఖ్య 406కు పెరిగింది.