హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే అనేక బహుళజాతి సంస్థలు కొలువుదీరిన హైదరాబాద్కు ఇంకా అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీంతో ఐటీ కారిడార్ (వెస్ట్ జోన్) పరిధిలో నిర్మాణ రంగం ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకుపోతున్నది. ప్రత్యేకించి బహుళ అంతస్థుల (హైరైజ్) భవనాలు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 48 నుంచి 59 అంతస్థుల వరకు కలిగిన బహుళ అంతస్థుల భవనాలు 10 నిర్మితమవుతున్నాయి. వీటిలో 9 భవనాలు ఐటీ కారిడార్ పరిధిలోని కోకాపేట, పుప్పాల్గూడ ప్రాంతంలో, మరో భవనం శేరిలింగంపల్లి ప్రాంతంలో ఉన్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ వెల్లడించింది. దీంతో హైరైజ్ భవనాలు అధికంగా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ దేశ రాజధాని ఢిల్లీని అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. దేశంలో ప్రస్తుతం ముంబై తర్వాత హైదరాబాద్లోనే హైరైజ్ భవనాలు అధికంగా ఉండటం గమనార్హం.
క్యూ కడుతున్న భారీ నిర్మాణ సంస్థలు
ఐటీ కారిడార్లో అత్యంత కీలకమైన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల తర్వాత కొత్తగా అభివృద్ధి చెందుతున్న నానక్రాంగూడ, నార్సింగి, పుప్పాల్గూడ, కోకాపేట ఉన్నాయి. గత మూడేండ్లలో అనుమతులు పొందిన హైరైజ్ భవనాలన్నీ ఈ ప్రాంతంలోనే నిర్మితమవుతున్నాయి. ప్రస్తుతం ఫైనాన్సియల్ డిస్ట్రిక్, నానక్రాంగూడ, పుప్పాల్గూడ, కోకాపేటలో ఖాళీ స్థలాల లభ్యత తగ్గడంతో భారీ నిర్మాణ సంస్థలన్నీ నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు ఐటీ కారిడార్లో భాగమవడంతో హైరైజ్ బిల్డింగ్లతోపాటు పెద్ద సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు చేపట్టేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు.