హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖాన సేవలు మరింత విస్తరించనున్నాయి. కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి మరింత మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దవాఖానను అభివృద్ధి చేస్తున్నది. దవాఖానలో రోజుకు 1,200 మందికి ఓపీ సేవలు అందిస్తున్నారు. రోజుకు 100 నుంచి 120 మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. వివిధ కారణాలతో కంటి సమస్యలు పెరుగుతుండటంలో రద్దీ కూడా ఎక్కువైంది. దీంతో ఓపీ సేవలు, ఆపరేషన్ల కోసం నిరీక్షించాల్సి వస్తున్నది.
రోగుల బాధలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆధునిక హంగులతో కొత్త టవర్ను నిర్మిస్తున్నది. దవాఖాన ప్రాంగణంలో నిర్మిస్తున్న కొత్త టవర్లో ప్రత్యేకంగా ఓపీ విభాగం, 10 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చనున్నది. కొత్త టవర్, అదనపు వసతులు అందుబాటులోకి వస్తే.. వైద్యుల సంఖ్యతోపాటు ఆప్తాల్మాలజీ విభాగంలో మెడికల్ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
కొత్త టవర్తో శస్త్రచికిత్సలు రెట్టింపు
ప్రస్తుతం సరోజినీదేవి కంటి దవాఖానలో రోజుకు 100 నుంచి 120 వరకు కంటి శస్త్రచికిత్సలు చేస్తున్నాం. కొత్త టవర్ అందుబాటులోకి వస్తే రోజుకు 200 మందికి శస్త్రచికిత్సలు చేసే అవకాశం లభిస్తుంది. దవాఖానకు కొత్తగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఐదు, ప్రొఫెసర్ పోస్టులు మూడు చొప్పున వస్తాయి. దీనివల్ల యూనిట్ల సంఖ్య పెరిగి, ఓపీ సేవలు విస్తరిస్తాయి. కార్పొరేట్ను తలదన్నేలా మరింత మెరుగైన వైద్యం అందించగలుగుతాం.
– డాక్టర్ రాజలింగం, సూపరింటెండెంట్, సరోజినీదేవి కంటి దవాఖాన