హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తన పెద్దరికాన్ని పార్లమెంట్లో చాటుకోనున్నది. రాజ్యసభలో 10 మంది తెలంగాణ బిడ్డలు తమ గళాన్ని వినిపించనున్నారు. విభజన చట్టం ప్రకారం పార్లమెంట్లో ఎగువ/పెద్దల సభకు రాష్ర్టానికి ఏడుగురు సభ్యులే. కానీ ఈసారి అనూహ్యంగా వారి సంఖ్య పదికి చేరనున్నది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, రాజ్యసభలో పార్టీ ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి, సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్ ఉండగా, ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో గెలిచి సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం రాజ్యసభలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అదేవిధంగా మరో 2 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 3న వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి నుంచి ఎన్నికల ధ్రువపత్రాలు అందుకోనున్నారు. రాష్ట్ర కోటా ప్రకారం టీఆర్ఎస్ రాజ్యసభసభ్యులుగా ఏడుగురితో పరిపూర్ణం అవుతుంది. ఏపీ నుంచి రాష్ర్టానికి చెందిన ఆర్ కృష్ణయ్య, నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది నిరంజన్రెడ్డి ఎన్నిక కానున్నారు. మంగళవారం యూపీ నుంచి డాక్టర్ కే లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు. వీరితో కలిపి మొత్తం 10 మంది తెలంగాణ బిడ్డలు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించనున్నారు.