హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల దాడుల్లో మృతిచెందిన కుటుంబాలకు పరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర వన్యప్రాణి మండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నది. మనుషులు-జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యలపై సోమవారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్లో వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకొంటున్న చర్యలను పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ వివరించారు. రాష్ట్రంలో మొదటిసారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నదని తెలిపారు. వన్యప్రాణుల (పులులతో సహా) దాడుల్లో చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్టు వెల్లడించారు. సాధారణ గాయాలైతే వైద్యానికి రూ.లక్ష (గరిష్ఠంగా), తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షలు (గరిష్ఠంగా), అంగవైకల్యం ఏర్పడితే రూ.లక్ష పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే రూ.50 వేలు (గరిష్ఠంగా), పంటలు, పండ్ల తోటల నష్టానికి ఎకరాకు రూ.6 వేల నుంచి 7,500కు పెంచాలని (గరిష్ఠంగా రూ.50వ వేలు) చెల్లించాలని కమిటీ ప్రతిపాదించింది.
స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1న జీవో నం.3 ద్వారా పునర్వ్యవస్థీకరించింది. ఆ తర్వాత జరిగిన తొలి సమావేశం ఇది. ఈ సమావేశంలో స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నది. ఇప్పటికే 24 అటవీ అనుమతుల ప్రతిపాదనలు రాగా, 15 దరఖాస్తులను నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపారు. మిగతా 9 రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. తాజాగా, మరో 7 ప్రతిపాదనలు బోర్డు ముందు ఉంచి చర్చించారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. హరిణ వసస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు అనుమతి ఇచ్చారు. జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్ నిర్మాణం కానున్నది. అమ్రాబాద్లో వన్యప్రాణి సంరక్షణ దృష్ట్యా శ్రీశైలం రహదారి విస్తరణ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇతర రోడ్డు, ఇరిగేషన్, (కడెం పరిధిలో లక్ష్మీపూర్ లిఫ్ట్, నాగార్జునసాగర్ పరిధిలో పెద్దగుట్ట లిఫ్ట్) కేబుల్ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్యూటీమ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, ఇతర సభ్యులు కోవలక్ష్మి, రాఘవ, బానోతు రవి కుమార్, అనిల్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.