Biryani | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): చికెన్ బిర్యానీ ఎప్పటిలాగానే ఫుడ్ప్రియుల హాట్ ఫేవరెట్గా నిలిచింది. హైదరాబాదీల మనసు దోచింది. రంజాన్ మాసంలో బిర్యానీ ఆరగించేందుకు నగరవాసులు పోటీపడ్డారు. దేశంలోనే 10 లక్షల బిర్యానీ ఆర్డర్లతో హైదరాబాద్ టాప్ ప్లేస్ దక్కించుకున్నది. రంజాన్ మాసంలో మార్చి 12 నుంచి ఏప్రిల్ 8 తేదీల మధ్యలో ఆర్డర్స్ను ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ఫామ్ స్విగీ సమీక్షించింది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ మాసంలో బిర్యానీతోపాటు హలీంలోనూ హైదరాబాద్ రికార్డును సొంతం చేసుకున్నది. 5.3 లక్షలు హలీం ఆర్డర్లు డెలివరీ చేశామని వివరించింది.
ఇఫ్తార్ సమయాల్లో (సాయంత్రం 5:30-7 గంటల మధ్యలో) 34 శాతం ఇఫ్తార్ ఆర్డర్స్ పెరిగాయని పేర్కొన్నది. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, మటన్ హలీం, సమోస, ఫలుదా, ఖీర్ టాప్ ప్లేస్లో ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్టు స్విగ్గీ తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ మాసంలో 15 శాతం అమ్మకాలు పెరిగాయని వివరించింది. హలీం ఆర్డర్లలో 1454.88 శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించింది. దీని తర్వాత స్థానంలో ఫిర్నీ ఆర్డర్లలో 80.97 శాతం, మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57.93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని స్విగ్గీ వివరించింది. ఉపవాస దీక్ష విరమణకు నగరవాసులు అధికంగా ఆన్లైన్లో ఆర్డర్ల మీదనే ఆధారపడినట్టు తెలిపింది. దేశంలో ఆన్లైన్ ఆర్డర్లలో ముంబై, కోల్కతా, లక్నో, భోపాల్ తదితర నగరాల్లోనూ ఆర్డర్స్ అత్యధికంగా వచ్చాయని వివరించింది.