హైదరాబాద్/రవీంద్రభారతి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కోహెడ వద్ద పది ఎకరాల విస్తీర్ణంలో సకల వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించనున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతియేటా జూన్ 7 నుంచి 9 వరకు అన్ని జిల్లాల్లో మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్టు చెప్పారు. చేప వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామని అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సోమవారం బేగంపేటలోని హరితప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలు, అమలు చేసిన పథకాలతో రాష్ట్రంలో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు.
ఉచిత చేప పిల్లల పంపిణీతో విప్లవాత్మక మార్పు వచ్చిందని, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు. దేశంలో ఎకడా లేనివిధంగా రాష్ట్రంలో 3.50 లక్షల మంది సభ్యులతో 5 వేల మత్స్య సొసైటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. అనంతరం 6 ఉత్తమ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మంత్రి మెమెంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పిట్ల రవీందర్, మత్స్యకార జేఏసీ చైర్మన్ మల్లయ్య, వివిధ జిల్లాలకు చెందిన మత్స్యకార సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.