దుగ్గొండి, ఏప్రిల్ 28 : కాపలా ఉండాల్సిన ఓ పెంపుడు కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మంచంపై ఉన్న డబ్బుల సంచిని నోట కరచుకొని పరుగుతీసి ఎక్కడో వదిలేయడంతో లబోదిబోమనడం అతడి వంతైంది. ఆశ్చర్యపరిచే ఈ ఘటన బుధవారం సాయంత్రం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో జరిగింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కాసు చేరాలు వృత్తిరీత్యా గొర్రెలు మేపుతూ వాటితో వ్యాపారం చేస్తుంటాడు.
బుధవారం కొన్ని గొర్రెలను విక్రయించగా రూ.1.50 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును తన నడుము చుట్టూ కట్టుకొనే జోలె సంచిలో వేసుకొని ఇంటికి వచ్చాడు. స్నానం చేద్దామని జోలె సంచి తీసి మంచంపై పెట్టి వెళ్లాడు. తీరా వచ్చి చూస్తే సంచి లేకపోవడాన్ని గమనించి యజమాని అటుఇటూ వెతికాడు. తమ కుక్కే సంచి తీసుకెళ్లిందని తెలిసి వీధివీధినా గాలించాడు. కుటుంబసభ్యులంతా కలిసి కుక్కను తీసుకొని ఆ డబ్బుల కోసం జల్లెడ పడుతున్నారు. స్థానికులు సైతం గ్రామ పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. ఎవరికైనా దొరికితే ఇవ్వాలని వేడుకుంటున్నారు. కుక్క చేసిన పనికి బాధితుడు లబోదిబోమంటున్నాడు.