హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కరోనాతో చదువులకు దూరమైన 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటివద్దే పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆటలు, పాటలతో కూడిన యానిమేషన్ వీడియోలతో ఆకట్టుకునేలా పాఠ్యాంశాలను రూపొందించింది. రోజుకు అరగంట చొప్పున పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణాసంస్థ (ఎస్సీఈఆర్టీ) హోం లెర్నింగ్ ప్రోగ్రాంను రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్నది. రెండుదశల్లో విద్యార్థులకు పాఠాలను బోధించనున్నారు. ఆగస్టు 31 వరకు రెడీనెస్ ప్రోగ్రాం, సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ పాఠ్యాంశాలను బోధించనున్నారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి శనివారం మార్గదర్శకాలను విడుదలచేశారు. కరోనాతో గతేడాది 1, 2 తరగతులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించలేదు.
ప్రస్తుతం 2వ తరగతిలో ఉన్న విద్యార్థులు ఒకటో తరగతిలో ఏం చదవకుండానే పై తరగతికి ప్రమోట్ అయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం హోం లెర్నింగ్ ప్రోగ్రాంకు రూపకల్పనచేశారు. 1, 2 తరగతులకు వేర్వేరుగా కాకుండా, కలిపి ఒకే సిలబస్ను బోధించనున్నారు. ఇక విద్యాసంవత్సరం ముగింపు సమయంలో రెండో తరగతి విద్యార్థులకు ఆయా తరగతిలోని ముఖ్యమైన పాఠ్యాంశాలను బోధించనున్నారు. రీడ్ ఎలాంగ్ యాప్ను ఎస్సీఈఆర్టీ యూట్యూబ్ చానళ్లను పూర్తిస్థాయిలో వినియోగించుకుని 1, 2 తరగతుల్లోని విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. ఇందుకు డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. హోం లెర్నింగ్ ప్రోగ్రాం, టీవీ క్లాసులపై ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించాలని, టీవీ క్లాసులు, క్యాలెండర్లను సమయానుగుణంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపించాలని, టీచర్ల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తిచేయాలని ఆదేశించారు.
ఆగస్టు మూడు నుంచి 10వ తరగతి విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి 31 వరకు బ్రిడ్జికోర్సు పాఠ్యాంశాలను ప్రసారంచేశారు. ఆగస్టు 3 నుంచి ప్ర స్తుతం చదువుతున్న తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలను బోధించనున్నారు. ఈ మేరకు టీశాట్, డీడీ యాదగిరి చానళ్లల్లో ప్ర సారమయ్యే పాఠ్యాంశాల షెడ్యూల్ను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ డైరెక్టర్ కృష్ణారావు శనివారం విడుదలచేశారు.