హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ప్రజల నుంచి వ్యక్తమైన అనేక సందేహాలకు ఎలాంటి సమాధానమివ్వకుండానే ముగిసింది. అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం గత నెల 28న ప్రారంభమైన ప్రజా పాలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,25,84,383 మంది తమ దరఖాస్తులను అధికారులకు అందించారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసే నాటికి కూడా ప్రజల నుంచి వ్యక్తమైన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయలేకపోయింది. కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు పూర్తవుతుంది, లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది, వారికి పథకాలను ఎప్పుటి నుంచి అమలు చేస్తారు అన్నదానిపై ప్రభుత్వ పెద్దలు ఇంతవరకు నోరు మెదపలేదు.
సబ్సిడీపై వంట గ్యాస్, రైతుబంధు, పింఛన్లు తదితర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు దరఖాస్తు పత్రాల్లో దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతా నంబర్ను అడగకపోవడంతో.. పెన్షన్ చెల్లింపులు ఎలా జరుగుతాయని పలు చోట్ల మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రశ్నించడం కనిపించింది. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రభుత్వం ప్రతినెల రూ.2500 చెల్లిస్తామన్న సంగతి తెలిసిందే. ఇక వంట గ్యాస్ సబ్సిడీని అన్ని వర్గాల వారికి వర్తింపచేస్తారా లేక దానికేమైనా ప్రత్యేకమైన ఎంపిక విధానం ఉంటుం దా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. మొదట్లో రేషన్కార్డుల జారీపై ఎటువంటి స్పష్టతనివ్వకపోడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రేషన్కార్డుల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆ తర్వాత ప్రత్యేక దరఖాస్తును రూపొందించారు.
అనేకచోట్ల దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వ అధికారులను ప్రజలు ఈ విషయమై ప్రశ్నించినప్పుడు తమకు దరఖాస్తులు మాత్రమే తీసుకోవాలని చెప్పారని, మార్గదర్శకాల గురించి తమకేమీ తెలియదని, సందేహాలను తాము తీర్చలేమని వారు బాహాటంగానే చెప్పారు. అయినా ప్రజలు భారీ సంఖ్యలో తమ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రభుత్వ కార్యాలయా లు, గ్రామసభల వద్ద క్యూ కట్టారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన కూడా వారి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వారు అయోమయానికి గురయ్యారు. కోటికిపైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు చాలా సమయం పడుతుందని, ఈలోగా లోక్సభ ఎన్నికల కోడ్ వస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒకసారి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే లోక్సభ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు జూన్ నెల దాటుతుందని, అప్పటివరకు పథకాల అమలు లేనట్టేనని అంటున్నారు. అలాంటప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ వాగ్దానం గాలిలో కలిసిపోయినట్టేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, వచ్చిన దరఖాస్తులను ఈ నెల 17లోగా కంప్యూటరీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ డాటా ఎంట్రీని మండలస్థాయిలోనే పూర్తిచేయాలని సూచించారు. మండల స్థాయిలో కావాల్సినన్ని కంప్యూటర్లు లేవని, డాటా ఎంట్రీ ఆపరేటరల కొరత ఉన్నదని అధికారులు అంటున్నారు.