హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ ప్రభావం హెచ్ఎండీఏపై పడింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో గుర్తించినవే కాకుండా ఈ స్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టడానికి కారణమైన భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల లెక్కలను తేల్చేందుకు ఏసీబీ సిద్ధమైంది. హెచ్ఎండీఏలో డైరెక్టర్గా బాలకృష్ణ 2018 నుంచి 2023 జూలై 12 వరకు విధులు నిర్వర్తించిన సమయంలో ఇచ్చిన అనుమతుల ఫైళ్లన్నీ పరిశీలిస్తామని, వాటిని సిద్ధ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. దాంతో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని జోన్లవారీగా ఫైళ్లను ఒక్కచోటకు చేర్చే పనిని మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని ఆ విభాగం అధికారులకు ఏసీబీ గుబులు పట్టుకున్నది.
హెచ్ఎండీఏ పరిధిలోని నాలుగు జోన్లైన శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్, ఘట్కేసర్లో భారీ లేఅవుట్లు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ (ఎంఎస్బీ)లకు అనుమతి ఇచ్చే అధికారం బాలకృష్ణ పరిధిలోనే ఉండేది. హెచ్ఎండీఏ డైరెక్టర్గా పనిచేస్తూనే, మాసాబ్ట్యాంక్లోని ఎంఎయూడీ ప్రధాన కార్యాలయంలో బాలకృష్ణ డైరెక్టర్గా ఉన్నారు. రెండు కీలకమైన స్థానాల్లో ఉంటూ హెచ్ఎండీఏలో భవన నిర్మాణ అనుమతులన్నీ ఎక్కువగా మాసబ్ట్యాంక్లోని ఎంఎయూడీ కార్యాలయం నుంచే ఇచ్చేవారని ఇక్కడి ఉద్యోగులు చెప్తున్నారు. ఇంటి అనుమతులకు పారదర్శక విధానమైన టీఎస్-బీపాస్ను గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. కానీ, ఆన్లైన్ వ్యవస్థను పక్కన పెట్టి డిస్కషన్ పేరిట పైళ్లు ఆయనకు వద్దకు తెప్పించుకునే వారని ఉద్యోగులు చెప్తున్నారు. ఇవన్నీ విషయాలు ఫైళ్లవారీగా ఏసీబీ విచారిస్తే తమకు మెడకు చుట్టుకుంటుందోనన్న భయాందోళన కొందరు అధికారుల్లో నెలకొన్నది.