మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం. 72 ఏండ్ల ఓ వృద్ధుడు ఉండే ఓ వీధిలో వారం రోజుల నుంచి కొత్తగా కూరగాయలు, పండ్లు ఫలాలు అమ్మే వ్యక్తులు కనిపిస్తున్నారు. రెక్కీ అనంతరం.. ‘అంతా ఓకే’ అనుకున్న తర్వాతే పండ్లు అమ్మే వ్యక్తి ఆ వృద్ధుడి ఇంట్లోకి వెళ్లి అతడిని అరెస్ట్ చేశాడు. అప్పటి వరకు కూరగాయలు, పండ్లు అమ్మిన తెలంగాణ సీఐడీ పోలీసులు తమ వేషం తీసేసి.. మధ్యప్రదేశ్కు చెందిన ఆ వృద్ధుడిని మహబూబ్నగర్ కోర్టుకు తరలించారు.
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : వినటానికి సినిమా కథలా ఉన్నా ఇది రియల్ స్టోరీ. తెలంగాణ సీఐడీ పోలీసులు ఛేదించిన పలు కేసుల్లో ఇది ఒకటి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్టయిన ఆ వృద్ధుడు క్రైమ్ నంబర్ 49/2005. రూ.4 కోట్లకు పైగా ప్రజల సొమ్మును మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడు. పేరు క్షీరసాగర్. బెయిల్పై బటికొచ్చి 18 ఏండ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. అప్పుడతనికి 54 ఏండ్లు. ఇప్పుడు సుమారుగా 72 ఏండ్లు. ఎన్నో అడ్రస్లు మార్చాడు. మారువేషాల్లో తిరిగాడు. పాతకేసుల తుప్పు వదిలిస్తున్న సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్.. ఎస్పీ రాంరెడ్డి బృందానికి ఈ కేసును అప్పగించారు. నిందితుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంటున్నట్టు కనిపెట్టారు. కచ్చితమైన సమాచారంతో అరెస్టు చేసేందుకు కూరగాయలు, పండ్లు అమ్మే వ్యక్తుల అవతారమెత్తి వారం, పది రోజులపాటు వీధి వీధి గాలించారు. ఓ వీధిలో క్షీరసాగర్ అడ్రస్ తెలుసుకున్నారు. కూరగాయల నుంచి అతని వేలిముద్రలు తీసుకొని, అంతా నిర్ధారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు.
క్రైమ్ ఇన్వెస్ట్గేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) నేరస్థులను పట్టుకునేందుకు కొత్త కొత్త ఎత్తుగడలను వేస్తున్నది. కేరళకు చెందిన ఓ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోస్టుమ్యాన్ అవతారం ఎత్తారు. మహారాష్ట్రలో పరమేశ్వర్ అనే వైట్కాలర్ నేరస్తుడిని పట్టుకునేందుకు సేల్స్మెన్ అవతారం ఎత్తారు. సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేస్తున్న పల్లె సారయ్యను పట్టుకునేందుకు నిరుద్యోగుల్లా వెళ్లారు. సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ సూచనలతో కొత్త పంథా ఎంచుకుంటూ నాన్ బెయిలబుల్ కేసుల్లో నిందితులను వరసగా అరెస్టు చేస్తున్నారు.
గడిచిన ఐదు నెల్లలోనే 15 మంది నాన్బెయిలబుల్ వారెంట్ నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిలో 30 ఏండ్లకు పైగా తప్పించుకుని తిరుగుతున్న వారు ఆరుగురు ఉండగా.. 28 ఏండ్లుగా తప్పించుకున్న వారు ముగ్గురు ఉన్నారు. మిగతా వారంతా పదేండ్లకు పైగా తప్పించుకుని తిరుగుతున్నవారే.