సుబేదారి, ఏఫ్రిల్ 22: నెల క్రితం ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసాల్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.2 కోట్ల 94 లక్షల ఆస్తులు ఉన్నట్టు నిర్ధారించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసునమోదు కావడంతో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో హనుమకొండలోని కాకతీయ కాలనీలోని తస్లీమా నివాసం, యాదవనగర్తోపాటు సూర్యాపేటలోని కుటుంబసభ్యులు, భూపాలపల్లిలోని డాక్యుమెంటరీ రైటర్స్ ఇండ్లల్లో సోదాలు చేపట్టారు.
ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. డాక్యుమెంట్లు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదు ఇండ్ల విలువ రూ.27 లక్షలు, 6 ఓపెన్ ప్లాట్ల విలువ రూ.12 లక్షలు, 3 ఎకరాల వ్యవసాయ భూమి విలువ రూ.20 లక్షల 40 వేలు, వాహనాల విలువ రూ.23 లక్షల 66 వేలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ.98,787తోపాటు నగదు రూ.1,92,900 ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. తస్లీమా మొత్తం ఆస్తుల విలువ రూ.2 కోట్ల 94 లక్షల 547 ఉన్నట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించారని, ఇంకా విచారణ కొనసాగుతున్నదని వివరించారు.