హైదరాబాద్ : సింగరేణి బొగ్గుకు ఉన్న తీవ్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తిని సాధించాలని కంపెనీ సీఎండీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల మేనేజర్లతో ఉత్పత్తి, రవాణాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్వంటి రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రెండు మూడు రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని, 15 పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు.
సింగరేణితో ఒప్పందం ఉన్న తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పుడు వారం నుంచి పది రోజుల వరకు బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాల్లో తీవ్ర కొరత ఉందని, సంస్థ తనవంతుగా నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను మించి బొగ్గు రవాణా చేయాలన్నారు. విదేశీ బొగ్గు ధర వందశాతం పెరగడంతో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు స్పాంజ్ ఐరన్, సిమెంట్ వంటి పరిశ్రమలు నేడు స్వదేశీ బొగ్గు వైపు చూస్తున్నాయని, కేంద్ర మంత్రిత్వ శాఖ సైతం నిత్యం ఇదే విషయంపై సమీక్షలు జరుపుతూ ఉత్పత్తి, రవాణాను పెంచాలని కోరుతున్నట్లు చెప్పారు.
గడచిన ఆరు నెలల కాలంలో సింగరేణి గత ఏడాది తొలి ఆరు నెలల కన్నా గణనీయమైన వృద్ధిని సాధించిందని వెల్లడించారు. మిగితా ఆరు నెలలు సైతం ఇదే ఒరవడితో పని చేస్తూ లక్ష్యాలను మించి ఉత్పత్తి, రవాణా సాధించాలని పిలుపునిచ్చారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినందున అక్టోబర్లో రోజుకు కనీసం 1.9లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో రవాణా చేయాలని ఆదేశించారు. 13లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ (ఓవర్ బర్డెన్)ను తొలగించాలని సూచించారు. ఏరియాల వారీగా జీఎంలు ఉత్పత్తి, రవాణాపైనే పూర్తిగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
సమావేశంలో డైరెక్టర్(ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డీ సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్, పీఅండ్పీ ) ఎన్ బలరామ్ (ఢిల్లీ నుంచీ వీసీ ద్వారా), అడ్వైజర్ (మైనింగ్) డీఎన్ ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ (కోల్ మూమెంట్) జే ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) కే సూర్యనారాయణ, జీఎం (మార్కెటింగ్) కే రవిశంకర్, జీఎం (సీపీపీ) నాగభూషణ్ రెడ్డి, జీఎం (పీఅండ్ పీ) సత్తయ్య, జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, ఆయా ఏరియా జీఎంలు పాల్గొన్నారు.