హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును గవర్నర్ ఆమోదించకుండా ఇంకా ఆలస్యం చేస్తే యువత ఆగ్రహంతో ఏమైనా చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీల్లో నియామకాల బిల్లును గవర్నర్ పెండింగ్లో పెట్టారని ఆయన గుర్తు చేశారు. పరిస్థితి చేయి దాటకముందే గవర్నర్ స్పందించాలని, కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులతో కలిసి సోమవారం తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
ఇతర రాష్ర్టాల్లో కొనసాగుతున్న కామన్ రిక్రూట్మెంట్ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. యువతకు ఎంతో మేలు చేసే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ దీర్ఘకాలంగా తన వద్దనే అట్టిపెట్టుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. అసెంబ్లీ, శాసనమండలి బిల్లులను ఆమోదించి నెలలు గడుస్తున్నా వాటిని ఆమోదించకపోవడం దేనికి సంకేతమంటూ ప్రశ్నించారు. బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో వేలాది ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయని ఆయన తెలిపారు. నిరుడు సెప్టెంబర్ 13న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లుకు వెంటనే మోక్షం కల్పించాలని గవర్నర్ను డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై గవర్నర్ సందేహాలను లేవనెత్తడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి చైర్మన్, విద్యాశాఖ కార్యదర్శి నిరుడు నవంబర్ 10న స్వయంగా రాజ్భవన్కు వెళ్లి నివృత్తి చేశారని గుర్తుచేశారు.
ప్రభుత్వం యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టి అక్కడున్న బోధన సిబ్బంది కొరతను తీర్చాలని చూస్తే.. గవర్నర్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 9,79,327 పోస్టులను మోదీ సర్కార్ భర్తీ చేయడం లేదని, తెలంగాణలోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామంటే గవర్నర్ అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. ‘కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉద్యోగాలు ఇవ్వదు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తానంటే ఇయ్యనియ్యదు. ఇదే వారి వైఖరి’ అంటూ ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత ఆందోళన చెందుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును ఆమోదించాలని రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన గవర్నర్కు బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు.
కుట్రతోనే బిల్లు పెండింగ్
ఎస్సీ, ఎస్టీ యువతకు అవకాశాలు కల్పించడానికి వర్సిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం తెచ్చిందని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. గవర్నర్ కుట్రతో బిల్లును పెండింగ్లో పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయించిందని, నియామకాలు చేపడితే వర్సిటీలకు సరికొత్త కళ వస్తుందని, కానీ, గవర్నర్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీంతో నిరుద్యోగులు, వర్సిటీ విద్యార్థులు, యువత ఉద్యమానికి సిద్ధమవుతున్నారని, పరిస్థితి చేయి దాటకముందే గవర్నర్ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. వేరే రాష్ర్టాల్లో అమలులో ఉన్న కామన్ రిక్రూట్మెంట్ను తెలంగాణలో తెస్తే తప్పేంటని గవర్నర్ను ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఏం చెప్తే గవర్నర్ అదే అమలు చేస్తున్నారని విమర్శించారు. బిల్లు ఆమోదించకపోతే విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని ఆయన హెచ్చరించారు.