హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.1,45,522 కోట్ల ఎగుమతులతో 12.98% వృద్ధిని నమోదు చేసింది. 6,28,615 ఉద్యోగాల కల్పన ద్వారా 7.99% వృద్ధి సాధించింది. కేంద్ర గణాంకాలు, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ వివరాల ఆధారంగా రాష్ట్ర అర్థ గణాంకాలశాఖ శనివారం ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.1,28,807 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. 5,82,126 మందికి ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషి వల్లనే ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, దీంతో మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలవారు ఇక్కడ ఉపాధి పొందుతున్నారని వివరించారు.