నిజామాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘యే క్యా హైజీ. లోగ్ నహీ. కార్యకర్తబీ నహీ హై. ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ కర్దియే సాలా. మై సిటీకో జారహాహూ.. బైబై’ అంటూ బీజేపీ నిర్వహించిన సభా వేదికపై నుంచి శాసన సభాపక్ష నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అర్ధాంతరంగా దిగి వెళ్లిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం చోటుచేసుకొన్నది. ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ పేరుతో బోధన్ నియోజకవర్గంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో రాజాసింగ్ పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమాన్ని బోధన్ చౌరస్తాలో నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ కాస్తా మూడున్నర గంటలైనా మొదలవ్వలేదు. పైగా జనం ఎవ్వరూ లేరు.
పిలిచినా ప్రజలెవ్వరూ బీజేపీ వైపు రాలేదు. ఆఖరుకు నియోజకవర్గ ఇంచార్జి మేకపాటి ప్రకాశ్రెడ్డి సైతం చేతులెత్తేశారు. దీంతో కంగుతిన్న రాజాసింగ్ చేసేది లేక చేతులు ఊపుతూ ప్రజాగోస రథం దిగి కారెక్కారు.‘ఇజ్జత్ తీసిండ్రు. ఇదేం తరీఖా. ప్రోగ్రామ్ గిట్లనే ఉంటదా.. జనాలను తెప్పించే దమ్ము లేదు. మీరేం నాయకులు’ అంటూ హిందీలో రుసరుసలాడి వెళ్లినట్టు స్థానిక నాయకులు చెబుతున్నారు. మొత్తంగా ‘ప్రజాగోస.. బీజేపీ భరోసా’ ముగింపు సభ మొదలవ్వకుండానే అట్టర్ ఫ్లాప్ కావడంతో జనం ముందు జాతీయ పార్టీ బీజేపీ నవ్వుల పాలైంది. ముఖ్య అతిథే ముఖం చాటేసి వెనుదిరగడంతో ఉన్న కొద్దిమంది నాయకులు సైతం జెండాలను పీకేసి పక్కన పారేసి.. రథాన్ని మూలకు తోసేసి ఇంటి దారిపట్టారు. బీజేపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడటంతోపాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చకనే బోధన్ ప్రజలు బీజేపీని ఛీకొట్టినట్టుగా స్థానికంగా జోరుగా చర్చ నడుస్తున్నది.