జగిత్యాల కలెక్టరేట్, మార్చి 9: ఓ యువకుడి పాస్పోర్ట్ వెరిఫికేషన్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టయింది. శనివారం జగిత్యాలలో ఎస్పీ సన్ప్రీత్సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొడిదెల మహేశ్ గల్ఫ్కు వెళ్లే ప్రయతాల్లో ఉన్నాడు. 9వ తరగతి చదివిన అతను టెన్త్ సర్టిఫికెట్ ఉంటేనే పాస్పోర్ట్ వస్తుందని అదే గ్రామానికి చెందిన కే. చంద్రయ్య అలియాస్ చందును కలిశాడు.
చందు మహేశ్ను కరీంనగర్లో ఉండే తన బంధువు బత్తినోజు రజిత వద్దకు తీసుకెళ్లాడు. సర్టిఫికెట్కు రూ.30 వేలు అడగ్గా వెంటనే ఫోన్పే చేసి, ఫొటో ఇచ్చాడు. 27 రోజుల తర్వాత ఓపెన్ స్కూల్లో పదోతరగతి చదివినట్టుగా నకిలీ సర్టిఫికెట్ను మహేశ్కు ఇచ్చింది. సదరు సర్టిఫికెట్తో మహేశ్ పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్కు వచ్చిన ధర్మపురి ఎస్బీ హెడ్కానిస్టేబుల్ నర్సింగరావు సర్టిఫికెట్ నకిలీదని గుర్తించి పోలీసుల కు ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం రజిత-శ్రావణ్కుమార్లు సూత్రధారులని గుర్తించారు. వారిని విచారిస్తే నకిలీ సర్టిఫికెట్ల దందా వెలుగు చూసింది.హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా రజితకు జస్ట్ డయల్ ద్వారా వెస్ట్బెంగాల్లో ఉంటున్న రబీరాయ్తో పరిచయమైంది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తానని రబీరాయ్ తెలుపడంతో రజిత-శ్రావణ్కుమార్ ఈ దందాకు తెరలేపారు.
కావాల్సిన వారి వివరాలు, ఫొటోలను రజిత రబీరాయ్కి వాట్సాప్ చేస్తుంది. సర్టిఫికెట్లను రబీరాయ్ కొరియర్ ద్వారా రజితకు పంపిస్తాడు. రజిత డబ్బును రబీరాయ్ తల్లి లక్ష్మీరాయ్కు ఫోన్ పే ద్వారా చెల్లిస్తుంది. ఇప్పటివరకు రూ.15.41 లక్షలు పంపారు. ఈ కేసులో రజిత, శ్రావణ్కుమార్, చందు, మహేశ్ను అరెస్ట్ చేసి, 395 నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్టాప్, సీపీయూ, రూ.25 వేలు, ఐదు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు రబీరాయ్,లక్ష్మీరా య్ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.