హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో తొలిసారి బయోమెట్రిక్ తీసుకొని, రెండోసారి తీసుకోకపోవటంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. అభ్యర్థుల కోణంలో ఆలోచించే టీఎస్పీఎస్సీ బయోమెట్రిక్ తీసుకోలేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తొలిసారి పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ వల్ల అభ్యర్థులకు ఆలస్యం అవుతున్నట్టు గుర్తించిందని, అం దుకే ఈసారి ఆ విధానాన్ని నిలిపివేసిందని విశ్లేషిస్తున్నారు. బయోమెట్రిక్ వల్ల గతంలో అభ్యర్థులు విలువైన సమయాన్ని కోల్పోయారని వెల్లడించారు. అదీకాక.. ప్రీ ప్రింటెడ్ విధానంతో గతంలో తప్పు లు జరిగాయని, ఓ అభ్యర్థి గైర్హాజరు వల్ల మిగతా అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు మారిపోయాయని నిపుణులు వివరించారు. ఆ తప్పులను గుర్తించిన టీఎస్పీఎస్సీ.. అభ్యర్థే ఓఎంఆర్పై వివరాలు నింపే అవకాశం కల్పించిందని తెలిపారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఖర్చు నేపథ్యంలోనే బయోమెట్రిక్ అమలు చేయలేదని కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని టీఎస్పీఎస్సీ వర్గాలు తిప్పికొట్టాయి. అదంతా అవాస్తవమేనని, పరీక్షల నిర్వహణకు ఖర్చు విషయంలో రాజీ పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని వెల్లడించాయి. కాగా, దేశంలో అత్యున్నత నియామక సంస్థ యూపీఎస్సీ కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయటం లేదు. కేంద్ర, ఇతర రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో పోల్చితే టీఎస్పీఎస్సీ ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ప్రశ్నల జంబ్లింగ్తో మాస్కాపీయింగ్కు చెక్ పెట్టింది. గతంలో ఇంటర్వ్యూల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇంటర్వ్యూలను పూర్తిగా తొలగించింది. 80,039 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు సంకల్పించిందని, ఇది గిట్టని కొందరు పరీక్షల నిర్వహణపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని అభ్యర్థులకు నిపుణులు సూచించారు.