హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంటులో పది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం స్పందించకుండా, మొండిగా వ్యవహరిస్తున్నందున శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని రైతు వ్యతిరేక, ఫాసిస్టు ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. మంగళవారం పార్లమెంటు ఉభయసభల నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, ‘ఆజ్ సే హమారా నారా హై మోదీ సర్కార్ జానా హై’ (మోదీ ప్రభుత్వం పోవాలన్నదే ఇవాళ్టి నుంచి మా నినాదం) అన్నారు. మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిలబడిందని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే దాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ ఫాసిస్టు విధానంపై తిరుగుబాటు చేసేలా ప్రజలను ప్రజాస్వామ్య పద్ధతిలో సన్నద్ధం చేస్తామని చెప్పారు. పార్లమెంటులో కేంద్రం పది రోజులు తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పంటల కొనుగోళ్ల విషయంలో విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తమ గోడును వినడానికి సిద్ధంగా లేకపోవడం బాధించిందని కేకే ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ఒప్పించడంలో మంత్రి కిషన్రెడ్డి విఫలమయ్యారని దుయ్యబట్టారు.
రైతుల సమస్య పరిష్కారం కోసం ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. యాసంగి కొనుగోళ్లపై కేంద్రం కేంద్రమంత్రులది ఒక మాట.. రాష్ట్ర బీజేపీ నేతలది ఒక మాటగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, మంగళవారం పార్లమెంటులో మంత్రులు ఒకే అంశంపై పొంతనలేని సమాధానాలు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే కేంద్రం వైఖరిగా తేలిందని పేర్కొన్నారు. గతంలో పార్లమెంటులో సభ్యులెవరైనా నిరసన తెలిపితే, తక్షణమే సంబంధిత మంత్రులు ఆ ఎంపీని పిలిచి, సమస్యపై ఆరా తీసేవారని చెప్పారు. తాము ఇన్ని రోజులు ఆందోళన చేసినా కేంద్రం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరించిందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డిని చొరవచూపాలని కోరినా ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోగా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తమను అవహేళన చేశారని, అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ, రైల్వేలు, గోదాములు అన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆగం చేయాలని కుట్ర చేస్తున్నదని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఆయన రైతాంగానికి పిలుపునిచ్చారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, లోక్సభ సభ్యులు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ నేతకాని, పసునూరి దయాకర్, బీబీ పాటిల్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం నల్లని వస్ర్తాలు ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు. ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే ధాన్యం సేకరణపై సమగ్ర జాతీయ విధానం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. ‘యాసంగి పంట కొనుగోలు తేల్చాలి’.. ‘తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేయొద్దు..’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ఉభయసభల్లో టీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులను, కాగితాలను చించేసి, ఆగ్రహంతో వాకౌట్ చేశారు. బయటకు వస్తూ పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద నినాదాలు చేశారు.