హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్పై ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకునేది లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. శనివారం తెలంగాణభవన్లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి తదితరులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనకు కరోనా వచ్చినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.
కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని బండి సంజయ్ చేసిన ఆరోపణలను మంత్రి తలసాని తీవ్రంగా ఖండించారు. బాధ్యతగల ఎంపీగా ఉండి ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిపోయి ఈ కష్టకాలంలో వారిని మరింత భయపెట్టేవిధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా విజ్ఞత, విచక్షణ మరచి బండి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
దేశంలో నేడు కరోనా ఇంత భారీగా వ్యాప్తి చెందటానికి ప్రధాని మోదీయే కారణమని తామేనాడైనా అన్నామా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద బట్టకాల్చి మీదేసి గోబెల్స్ ప్రచారం చేయటం నీతిబాహ్యమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవటంలో అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం సీఎం కేసీఆర్ పరిధిలో ఉందని మంత్రి తలసాని అన్నారు.
బట్టెబాజ్ సంజయ్: శంభీపూర్ రాజు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాదు బట్టెబాజ్ సం జయ్ అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మండిపడ్డారు. బండి సం జయ్ తనమీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను 380 ఎకరాల భూమిని కబ్జాచేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. నిరాధార ఆరోపణలపై బండి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు బండి సంజయ్కు ద మ్ముంటే తాను కబ్జా చేసినట్టు నిరూపించాలని, ఆ భూములను ఆయన సమక్షంలోనే పేదలకు పంచుతానని తేల్చిచెప్పారు.
బీజేపీ నేతలకు కర్రుకాల్చి వాతపెట్టినా బుద్ధిరాలే : బాల్క సుమన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి కర్రుకాల్చివాత పెట్టినా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి బుద్ధిరాలేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ స్థాయిని, ఆయన వ్యక్తిత్వాన్ని, హోదాను గౌరవించకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఆగ్రహంవ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తిపై ప్రపంచ మీడియా భారతదేశ పరిస్థితులను ఎండగడుతున్న వైనమే బీజేపీ నేతల పాలన, వ్యవహార సరళికి నిదర్శమన్నారు. బీజేపీ నేతలది నరం లేని నాలుక అని, సంజయ్ది నోరు కాదు మోరీ అని విమర్శించారు. ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే ఇంజక్షన్లు, ఆక్సిజన్ కోటా, మందుల పంపిణీలో వివక్ష చూస్తున్న కేంద్రం వైఖరిపై దమ్ముంటే సంజయ్ మాట్లాడాలని అన్నారు. సాగర్ ఉప ఎన్నికలో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీజేపీకి వాత పెడతారని చెప్పారు.