హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో శుక్రవారం నుంచి జ్వర సర్వే నిర్వహించనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. ఇందులో ఆరోగ్య సిబ్బందితోపాటు పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వాములు అవుతారని చెప్పారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఈ మేరకు థర్డ్వేవ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంత్రి హరీశ్రావు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకొంటున్న చర్యలు, వ్యాక్సినేషన్, థర్డ్వేవ్ సన్నద్ధత తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించామన్నారు. కొవిడ్ వ్యాప్తిని ముందుగానే కట్టడి చేసేందుకు జ్వర సర్వే నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. శుక్రవారం నుంచి ఫీవర్ సర్వే ప్రారం భం అవుతుందని తెలిపారు. ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారని చెప్పారు. ఎవరికైనా లక్షణాలుంటే అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్ ఇస్తారని, వైద్య సిబ్బంది వారి ఆరోగ్యాన్ని రోజూ పరిశీలిస్తారని తెలిపారు. అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ దవాఖానకు తరలిస్తారని చెప్పారు. ఎలాంటి లక్షణాలు లేకపోతే కొవిడ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తారని తెలిపారు. హోం ఐసొలేషన్ కిట్లలో వాడే కొన్ని మందులు ప్రస్తుతం బయట దొరకటం లేదని, టెస్టింగ్ కిట్లకు కూడా కొరత ఉన్నదని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్త ఫలితంగా మనం అన్నింటినీ ముందే సమకూర్చుకోగలిగామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోటి ఐసొలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సమకూర్చుకొన్నామని వెల్లడించారు. వీటిని పీహెచ్సీ స్థాయికి పంపిణీ చేశామన్నారు.
జ్వర సర్వేలో భాగంగా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొంటుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గతంలో తెలంగాణ నిర్వహించిన జ్వరసర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. ‘బెస్ట్ ప్రాక్టీస్’ అని ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రత్యేకంగా బులెటిన్ విడుదల చేసిందని చెప్పారు. ఎకనమిక్ సర్వేలోనూ ఇంటింటి సర్వేను ప్రశంసించారని గుర్తుచేశారు. తాజా జ్వర సర్వేలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లోనూ కరోనా పరీక్షలు, కిట్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. కొవిడ్ తీవ్రత తగ్గేవరకు అన్ని బస్తీ దవాఖానలు ఆదివారాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందిస్తాయని మంత్రి తెలిపారు.
థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు చెప్పారు. జిల్లా దవాఖానల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. సెకండ్వేవ్ తర్వాత ముందు జాగ్రత్తగా 27వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించామని, 76 దవాఖానల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఫలితంగా ఉత్పత్తి సామర్థ్యం 300 మెట్రిక్ టన్నులకు పైగా పెరిగిందని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదని హరీశ్ తెలిపారు. పాజిటివిటీ రేటును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత తక్కువ ఉన్నదనే కారణంతో నిర్లక్ష్యం వద్దని ప్రజలను కోరారు. కచ్చితంగా రెండు డోసుల టీకాలు వేసుకోవాలని, అర్హులు బూస్టర్ డోస్ వేసుకోవాలని, కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరారు. సమావేశంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎస్ సోమేశ్కుమార్, ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, ఎండీ చంద్రశేఖర్, డీఎంఈ రమేశ్రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.