హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ పోరు ఉధృతి మరింత పెరిగింది. ఒకవైపు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు ఉవ్వెత్తున సాగుతుండగా, పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు పట్టిన పట్టు విడువకుండా పోరాడుతున్నారు. జాతీయ స్థాయిలో ఒకే పంట ఉత్పత్తుల కొనుగోలు విధానం ఉండాలని పట్టుబట్టారు. బుధవారం కూడా ఈ అంశంపై లోక్సభలో టీఆర్ఎస్ సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. మార్కెట్ యార్డుల్లో, కల్లాల్లో వడ్ల రాసులు పేరుకుపోతున్నాయని, దేశంలో ఇప్పుడు ఇదే అత్యవసర విషయంగా భావించి చర్చించాలని కోరారు. ఉదయం సభ సమావేశం కాగానే వడ్ల కొనుగోలుపై చర్చించాలని పట్టుబట్టారు. నామా నాగేశ్వర్రావు లేచి నిలబడి తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, బీబీ పాటిల్, వెంకటేశ్ నేతకాని ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. రాష్ట్ర రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్చేశారు. దేశవ్యాప్తంగా ధాన్యం విషయంలో ఒకే కొనుగోలు విధానం ఉండాలని కోరారు. టీఆర్ఎస్ ఎంపీల నిరసన నినాదాలతో లోక్సభ దద్దరిల్లింది. స్పీకర్ ఓం బిర్లా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించటంతో నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
టిబెట్ ఎంపీల బృందానికి నామా సత్కారం
బుధవారం భారత పార్లమెంటు సందర్శనకు వచ్చిన టిబెట్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ డోమ్లా టెసిరింగ్, ఎంపీలను టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు సత్కరించారు. పార్లమెంటు లైబ్రరీ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న నామా బుధవారం టిబెట్ ఎంపీల బృందానికి లైబ్రరీ విశేషాలను వివరించారు. గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు, దేశ చరిత్ర, సార్వభౌమత్వాన్ని తెలిపే చాయాచిత్రాలను చూపించారు.