స్టేషన్ఘన్పూర్, ఆగస్టు 14: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సోమవారం ప్రారంభిస్తున్న దళితబంధు పథకం దేశంలోనే చరిత్ర సృష్టించబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజీగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ.. దళితబంధు పథకం రాజకీయ పార్టీల దిశ, దశను మార్చబోతున్నదన్నారు. ప్రజల సంక్షేమం కోసం సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడం ఒక్క సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. దళితులపై ప్రేమ ఉన్నవారు, దళితులు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునేవారు దళితబంధు పథకాన్ని స్వాగతించాలని సూచించారు. విమర్శలు మాని.. ఈ పథకం ద్వారా అందించే ఆర్థిక సాయం నిజమైన, అర్హులైన వారికి దక్కేవిధంగా తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కోరారు. రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ఏమి జరుగలేదని, ఎన్నికల కోసమే హడావిడిగా ఈ పథకం ప్రకటించారనే నిరాధార విమర్శలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలుండగా వాటిలో దాదాపు 15 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకానికి అర్హత ఉన్నదన్నారు. వీరందరికి ఒకే సంవత్సరంలో ఆర్థిక సహాయం అందించకపోయినా.. వచ్చే ఐదారేళ్లలో పూర్తిగా అందిస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్లో సంవత్సరానికి రూ.25 వేల కోట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గతంలో నీటిపారుదల రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్టుగానే, దళిత బంధుకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కల్యాణ లక్ష్మి, మిషన్భగీరథ వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇలాగే విమర్శించారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలను విజయవంతంగా అమలు చేసి చూపిందన్నారు. దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చే ముందు పలు పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలతో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమలు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.