హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాల అక్రమ సరఫరాలో కీలక సూత్రధారి నైజీరియన్ టోనీతో డ్రగ్స్ వినియోగదారులకు ఉన్న సంబంధాలు ఏమిటో తేల్చాల్సి ఉన్నదని పోలీసులు హైకోర్టుకు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులుగా రిమాండ్ రిపోర్టులో పేరొన్న తొమ్మిది మంది వ్యాపార ప్రముఖులను ప్రశ్నించాల్సి ఉన్నదని, వారిని తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. పీపీ ప్రతాప్రెడ్డి వాదనలు వినిపిస్తూ, మత్తు దందా నిర్వాహకుడు టోనీ నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరంజన్కుమార్ జైన్, శష్వత్ జైన్, యజ్ఞానంద్ అగర్వాల్, డీఎస్ఎస్ రెడ్డి, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావు డ్రగ్స్ కొన్నట్టు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదుచేశారని చెప్పారు. ఆ తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులా లేక ఇతరులకు డ్రగ్స్ సరఫరా చేశారా అనేది తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అందుకే వారిని రెండు రోజులైనా పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ వాదనలను నిందితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులిస్తామని ప్రకటించింది.