హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): గోదావరి బేసిన్లో నిర్మించనున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన డీపీఆర్ల పరిశీలనను త్వరగా పూర్తిచేసి, కేంద్ర జల్శక్తి శాఖకు నివేదించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ కోరారు. శుక్రవారం జలసౌధలో ఇంజినీరింగ్ అధికారులతో గోదావరిపై తలపెట్టిన ప్రాజెక్టుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ అయ్యర్కు ఫోన్ చేసిన రజత్కుమార్.. ఆయా ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు వచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీతారామ, తుపాకులగూడెం, చౌటుపల్లి హన్మంతరెడ్డి, మోడికుంటవాగు, చిన్న కాళేశ్వరం (ముక్తీశ్వర) ప్రాజెక్టుల డీపీఆర్లను సీడబ్ల్యూసీ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్లోనే నివేదించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ, కందకుర్తి లిఫ్ట్, గూడెం లిఫ్ట్, రామప్ప-పాకాల లింక్, కంతనపల్లి ప్రాజెక్టులకు అనుమతులే అక్కర్లేదని, వాటిని అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని విన్నవించిందని తెలిపారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, శ్రీధర్రావు దేశ్పాండే, సీఈ మోహన్కుమార్ పాల్గొన్నారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యుడు రవికుమార్ పిైళ్లెకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో జలసౌధలో శానిటేషన్ చేయించారు. బోర్డు సిబ్బందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.