హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి వెల్లడించారు. డిస్కం పరిధిలో విద్యుత్తు డిమాండ్, కొత్త కనెక్షన్ల పెరుగుదలపై సోమవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధితో ఈ నెల 16న విద్యుత్తు డిమాండ్ 3,378 మెగావాట్లు ఉండగా, వినియోగం 72.26 మిలియన్ యూనిట్లుగా నమోదైందని తెలిపారు. ప్రతి నెల కొత్తగా సుమారు 37 వేల కొత్త విద్యుత్తు కనెక్షన్లు వస్తున్నాయని, ఏడాదికి 4 లక్షలకు పైగానే నమోదవుతున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి విద్యుత్తు డిమాండ్ సగానికి తగ్గిందని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ గృహ విద్యుత్తు కనెక్షన్లతోపాటు పరిశ్రమలకు హెచ్టీ కనెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయని సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. 2020-21, 2021-22, వార్షిక సంవత్సరాల్లో 7-8 శాతంగా పెరుగుదల ఉంటే, 2022-23లో ఏకంగా 15 శాతంగా పెరుగుదల ఉన్నదని వివరించారు. డిస్కం పరిధిలో 12 లక్షల హెచ్టీ కనెక్షన్లు ఉంటే, గృహ వినియోగదారుల కనెక్షన్లు 1.6 కోట్ల దాకా ఉన్నాయని, ఈ సంఖ్య మరింతగా పెరుగుతున్నదని తెలిపారు. నగర శివారులో కొత్తగా నిర్మిస్తున్న ఫార్మా సిటీ, డాటా సెంటర్లకు భారీ మొత్తంలో విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 5-10 ఏండ్లలో ఫార్మాసిటీకి 1000 మెగావాట్ల వరకు విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నలుమూలలా వేస్తున్న కొత్ల లేఔట్లలో విద్యుత్తు అవసరాలకు ప్రత్యేక స్థలం కేటాయించేలా చర్యలు తీసుకున్నట్టు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.