హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఎగువన మహారాష్ట్ర, కర్నాటకతోపాటు రాష్ట్రంలోనూ కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం 86 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం భారీగా వరద వచ్చి చేరుతున్నది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో సింగూరు ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసేశారు.
నిజాంసాగర్, రాజరాజేశ్వర జలాశయం, ఎల్ఎండీ, కడెం ప్రాజెక్టులతోపాటు, పార్వతి, సరస్వతి, లక్ష్మీ, సమ్మక్క బరాజ్ల నుంచి మాత్రం వరదను ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం డ్యాంకు ఆదివారం సాయంత్రానికి 1.20 లక్షల క్యూసెక్కుల వరద రాగా, సోమవారం సాయంత్రం 68 వేలకు పడిపోయింది. డ్యామ్ నుంచి సాగర్కు 59 వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు.