మామిళ్లగూడెం, జూన్ 23: ఖమ్మం నగరంలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకొన్నారు. జిల్లా ఎక్సైజ్శాఖ అధికారి నాగేంద్రరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీశ్రీ సరిల్లో ఖమ్మం ఎక్సైజ్ అధికారులు, స్టేట్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 60 గ్రాముల హాష్ ఆయిల్, 1,600 గ్రాముల ఎండు గంజాయి దొరికాయి.
కారులో ఉన్న ఖమ్మానికి చెందిన తుమ్మా భానుతేజరెడ్డి, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడేనికి చెందిన మేడిది రోహిత్రెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. వీరు ఖమ్మం నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్నట్టు గుర్తించారు. ప్రధాన నిందితుడు భానుతేజరెడ్డి బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు పెట్టుకొన్నాడు. డ్రగ్స్ కేసులో అక్కడి పోలీసులకు చిక్కిన భానుతేజరెడ్డి ఆ తర్వాత బయటకు వచ్చాడు. అక్కడి నుంచి హైదరాబాద్కు మకాం మార్చాడు. హైదరాబాద్లోనూ రెండుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఖమ్మం నగరానికి వచ్చాడు. ఆరు నెలలుగా నగరంలో నివాసం ఉంటూ బెంగళూరు, గోవా, ముంబై నుంచి డ్రగ్స్, ఏపీలోని అరకు ప్రాంతం నుంచి ఎండు గంజాయిని తెప్పిస్తున్నాడు. వాటిని హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహిత్రెడ్డి ఇతనికి సహాయకుడు ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎక్సైజ్ అధికారి తెలిపారు.