హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛమైన గాలిలో సేదదీరుతూ, ప్రకృతి అందాలను వీక్షిస్తూ కృష్ణా నదీలో ఆరున్నర గంటలపాటు సాగే అద్భుత యాత్రకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 28 నుంచి నాగార్జునసాగర్, సోమశిల నుంచి శ్రీశైలం వరకు రెండు క్రూయిజ్ బోట్లను నడపనున్నది. ఈ బోట్లు ఉదయం 9 గంటలకు బయలుదేరి ఆరున్నర గంటల్లోగా గమ్యస్థానానికి చేరతాయి. పర్యాటకులు హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బస్సులో నాగార్జునసాగర్ లేదా సోమశిలకు వెళ్లి అక్కడి నుంచి క్రూయిజ్ బోట్లో యాత్రను ప్రారంభించవచ్చు. శ్రీశైలం చేరుకున్నాక రాత్రికి అక్కడే విడిది ఏర్పాటుచేస్తారు. మర్నాడు ఉదయం దర్శనం పూర్తిచేసుకున్న తర్వాత బస్సులో తిరిగి హైదరాబాద్కు చేరుస్తారు. ఈ ప్యాకేజీకి రూ.3,999 చార్జి చేస్తారు. ఇలా కాకుండా వ్యక్తిగత వాహనాల్లో సాగర్ లేదా సోమశిలకు వెళ్లి అక్కడి నుంచి బోటులో శ్రీశైలానికి బయల్దేరవచ్చు. లేదా శ్రీశైలం నుంచి మిగిలిన రెండు ప్రాంతాల్లో ఏదో ఒక యాత్ర చేయొచ్చు. ఏదైనా ఒక డెస్టినేషన్కు వెళ్తే రూ.1,499, అక్కడి నుంచి మళ్లీ బోటులో తిరిగి రావాలనుకుంటే రూ.2,499 చార్జి చేస్తారు. కనీసం 60 మంది ఉంటే బోటులో ప్రయాణించే వెసలుబాటు కల్పిస్తా రు. మధ్యాహ్నం శాకాహార భోజనాన్ని, సాయంత్రం వేళలో టీ, స్నాక్స్ అందజేస్తారు. ఈ యాత్రకు సంబంధించిన టికెట్ల బుకింగ్కు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్టీడీసీ.ఇన్’ వెబ్సైట్ను లేదా ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్యలో కింది ఫోన్ నంబర్లను సంప్రదించాలి.