హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు ఎనిమిదికి చేరాయని వెల్లడించారు. దుబాయ్ నుంచి చార్మినార్కు వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఎనిమిది మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, లాక్డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు.
దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే దవాఖానల్లో చేరారని వెల్లడించారు. దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని వెల్లడించారు. ఈ వేరియంట్ వల్ల ప్రపంచంలో ఒక్క మరణం మాత్రమే నమోదయిందన్నారు. భవిష్యత్లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఒమిక్రాన్పట్ల అనవసర భయాందోళన అవసరం లేదని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమన్నారు. కొత్త వేరియంట్ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటా బయటా మాస్కు ధరించాలన్నారు. ప్రజలంతా బాధ్యతగా కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారని చెప్పారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు తీసుకున్నారని వెల్లడించారు. 56 శాతం మంది రెండు డోసులు వేసుకున్నారని తెలిపారు.