బషీరాబాద్, మార్చి 20: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులు సామాజికంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతున్నదని, ఇది పారిశ్రామిక సామర్థ్య నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నదని ఐక్యరాజ్య సమితి వేదిక సాక్షిగా వికారాబాద్ జిల్లా వాసి వివరించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఐక్యరాజ్య సమితి 52వ మానవ హక్కుల మండలి సమావేశానికి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బాద్లాపూర్ గ్రామానికి చెందిన మెట్టు సాయి సంపత్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతి కోసం చేపట్టే అనేక పథకాలు, కార్యక్రమల గురించి వివరిస్తూ ఐక్యరాజ్యపమితి పరిశీలకుడి హోదాలో నివేదిక సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక కార్యక్రమాలను అక్కడ వివరించారు. దళిత బంధు పథకం కింద దళితుల ఖాతాలో రూ.10 లక్షలు జమ చేసి వారు ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సాహం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం సృష్టిస్తున్న అద్భుతాలను సాయి సంపత్ ఐక్యరాజ్య సమితి దృష్టికి తెచ్చారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నదని యూఎన్ మానవ హక్కుల మండలి సమావేశంలో సాయి సంపత్ వెల్లడించారు.