కేటీఆర్ను పిలుద్దామన్నందుకే నా సీటు ఊడపీకిండు..
నేను జనరల్ సీట్ల గెలిచిన. నీ అవసరం కోసం నన్ను చైర్మన్ను జేసినవ్. నన్ను ఏం పనిచేయనీయలే. అన్నింటికి నువ్వే ముందున్నవ్. నీ పనుల కోసం వాడుకున్నవ్. చైర్మన్గా ఎన్ని చేద్దామనుకున్నా ఒక్క పనిచేయనియ్యకుండా జేత్తివి. మంది ముందు పనిజేయ్యమంటివి. తర్వాత వద్దంటివి. నన్ను ఎక్కడబడితే అక్కడ కంటుజెత్తివి. రమ్మని నీ ఇంటిసుట్టూ తిప్పుకుంటివి. ఏంజెప్పకుండా ఎన్నోసార్లు యెల్లగొడ్తివి. సభలల్ల పైసలు బాగిచ్చిన అని ఎన్నోసార్లు జెప్తివి.
నయా పైసియ్యకుండా ప్రజల ముందట బద్నాం జేస్తివి. నన్నైతే పనోనికంటే అధ్వానం జేసిండు. అధికార్లు, సిబ్బంది నా మాట ఇనకుండా జేసిండు. ఎన్నని జెప్పుకోవాలే. కొత్త బిల్డింగ్ కట్టుకున్నం. బిల్డింగ్ ఓపినింగ్కు, అభివృద్ధి కోసం మరిన్ని పైసలడుగుదామని కేటీఆర్ దగ్గరికి పోయి పిలుసుకొని వద్దామని పుసుక్కున ఈటలతో అంటి. అంతే మనుసుల పెట్టుకు న్నడు. నా సీటు ఊడపీకిండు. నన్ను ఎటు గాకుండ చేసిండు. పోడేటి రామస్వామి, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్
మమ్ముల ఏ మంత్రినైనా కలువనిస్తివా…
ఏం మాట్లాడుతున్నవో తెల్వకుండ మాట్లాడుతున్నవ్. రెండుసార్లు మంత్రిగా ఉంటివి. ఒక్కపైసా ఇయ్యకుంటజేత్తివి. నీ ఇంటిసుట్టూ తిరిగినంగాదూ.. ఒక్కసారా.. రెండుసార్లా.. వందలసార్లు తిరిగినం. నేను, హుజూరాబాదోళ్లు. అభివృద్ధి కోసం పైసలియ్యమన్నం. ఇంటిసుట్టు తిప్పుకున్నవ్. ప్రెస్మీట్ల 50సార్ల తిరిగిన్రని చెప్తవా..? పోయినమా మనం కేటీఆర్ దగ్గరికి. ఎక్కడికి రమ్మంటవో చెప్పు. అక్కడికత్తం. మాట్లాడుకుందం. మీటింగులల్ల కోట్లు ఇచ్చినవంటివి.
ఒక్కరోజన్న కేటీఆర్ దగ్గరికి తీసుకపోయినవా.. సరే నాకు నిధులిత్తలేరని మాకు చెప్తివా ఎన్నడైనా. మేమైతే నీకు దగ్గర్నే ఉన్నం గదా. వేరే మంత్రిని కలవకుండా జేత్తివి. నీ వెంట తిరిగినం. మమ్మల్ని తిప్పుకొని, తిప్పుకొని సంపినవ్. ఎన్ని ఇబ్బందులు పడ్డమో మాకే ఎరుక. ప్రభుత్వం మీద విరక్తి, వ్యతిరేకత రావడానికే నువ్విట్లాజేసినవా..? ఇప్పుడు తెలుస్తంది. మమ్మల్ని, ఊర్లల్ల సర్పంచ్లను, ఎంపీటీసీలను దగ్గర పెట్టుకుందామని అనుకున్నవ్. ఎంత ముందుసూపు సార్.. నీది. తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్
నిధుల కోసం మస్తు తిరిగినం..
జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లో డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కోసం గతంలోనే 40 కోట్ల చొప్పున మంజూరైనయి. నేను ఫైనాన్స్ మినిస్ట్టర్గా ఉన్నపుడే జీవోలు ఇచ్చిన. కానీ, నిధుల కోసం మస్తు తిరిగినం. ఆఖరికి హుజూరాబాద్ చైర్మన్ పదిసార్లు, జమ్మికుంట చైర్మన్ ఒక 50 సార్లు కేటీఆర్ దగ్గరికి పోయినా పనిగాలే. సార్ ఇత్తలేడని ఫోన్ చేసి మస్తు బాధపడ్డరు. గవే నిధులు ఇప్పుడిస్తున్నరు. – ఆగస్టు 12న జమ్మికుంట ప్రెస్మీట్లో బీజేపీ నేత రాజేందర్