వరంగల్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి తెలంగాణను ఎండబెట్టి గోదావరి నీటిని తమిళనాడుకు తరలిచేందుకు బీజేపీ కుట్రపన్నుతున్నది. ఇదే జరిగితే సమ్మక్క బరాజ్ మనుగడ ప్రశ్నార్థకమై దేవాదుల నీళ్లు రాక ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతది. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణకు, ఉమ్మడి వరంగల్కు నష్టం కలిగించే ఇచ్చంపల్లి ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలే పార్లమెంట్లో ఉండాలె’ అని వరంగల్ లోక్సభ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ తెగేసిచెప్పారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘నాలుగు పిల్లర్లు కుంగాయన్న సాకుతో మేడిగడ్డ ప్రాజెక్టును కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టింది. గోదావరి నీటిని వృథాగా సముద్రం పాలుజేసింది.. నీటి లభ్యత ఉన్నప్పుడు కూడా సమ్మక్క బరాజ్లో నిల్వ చేయకుండా దేవాదుల ఆయకట్టు రైతులను నిండా ముంచింది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ పరంగా ప్రచంచంలోనే మనదేశానికి ప్రత్యేక పాత్ర ఉన్నది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాయి. రెండుసార్లు ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ, దేశంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతుబంధు పెంచి ఇస్తామని చెప్పి రైతులకు మొండిచెయ్యి చూపింది. గతంలో ఇచ్చిన రూ.5 వేలను కూడా అందరికీ ఇవ్వడంలేదు. యాసంగి పంటకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైంది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఆత్మస్థయిర్యం సన్నగిల్లి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మేడిగడ్డ బరాజ్లో చిన్న మట్టి కట్ట కట్టి నీటిని పంపిణీ చేయాల్సింది పోయి, ఉన్న నీటిని సముద్రం పాలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. బీజేపీ సైతం తన స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి గోదావరి నీటిని తమిళనాడుకు తరలించాలని చూస్తున్నది. ఇదే జరిగితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. దీన్ని అడ్డుకునేందుకైనా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్కు పంపాలని కోరుతున్నా.
నా రాజకీయ ప్రస్థానంలో బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నో మంచి అవకాశాలు కల్పించింది. సామాన్య కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి ఒక్కటే. బీఆర్ఎస్లో అతి సామాన్య కార్యకర్తకు కూడా ఉన్నతమైన పదవులు వస్తాయనేందుకు నాతోపాటు చాలా మంది ఉదాహరణ. ఉద్యమకారులు, కార్యకర్తలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లుగా చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సాధారణ కార్యకర్తలుగా ఉండి హనుమకొండలో నేను, జనగామలో సంపత్రెడ్డి, ములుగులో జగదీశ్, భూపాలపల్లిలో జక్కు రాకేశ్ భార్య శ్రీహర్షిణి జడ్పీ అధ్యక్షులమయ్యాం. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి నేను కేసీఆర్ వెన్నంటే ఉన్నా. పదవులు లేకున్నా ఏనాడూ నేను ఉద్యమ బాట వీడలేదు. క్రమశిక్షణతో పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తయ్. కేసీఆర్ దీవెనలతో గొప్ప అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. వరంగల్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులేకుంటే బీఆర్ఎస్ నుంచి లాక్కున్నరు. అయినా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నరు.
అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాం. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు మంచి సహకారం అందిస్తున్నరు. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నరు. అన్ని సెగ్మెంట్లలో కార్యకర్తలు ఏకతాటిపై నడుస్తున్నరు. సోమవారం నేను నామినేషన్ వేసిన సందర్భంలో ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.
హనుమకొండ జడ్పీ అధ్యక్షుడిగా ఉన్న నాకు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలపై అవగాహన ఉన్నది. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలి. 1875 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయస్థాయిలో ఉన్న ఈ ఎయిర్పోర్టును ఉమ్మడి ప్రభుత్వాలు కుట్ర పూరితంగా నిర్వీర్యం చేశాయి. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు మామునూరు విమానాశ్రయాన్ని కావాలనే మూతపడేశాయి. వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు ఖిలా, రామప్ప, మేడారం సమ్మక్క-సారక్క జాతర, ఆసియాలోనే పెద్దదైన వరంగల్ వ్యవసాయ మార్కెట్ల ప్రాధాన్యతను తగ్గించే కుట్రలో భాగంగానే ఇక్కడ ఎయిర్పోర్టును పునరుద్ధరించడం లేదు. కేరళలోని కన్నూర్, కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య దూరం కేవలం 99 కిలోమీటర్లే. తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో 11 లక్షల జనాభా ఉంది. ఉమ్మడి వరంగల్లో 50 లక్షల జనాభా ఉన్నా మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నానా కొర్రీలు పెడుతున్నది. జార్ఖండ్లో కేవలం 2లక్షల జనాభా ఉన్న దేవ్ఘడ్లో రూ.6వేల కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఐఐటీ, ఐఐఎం, ఐఎస్ఏఆర్, ట్రిపుల్ ఐటీతో పాటు ప్రతి జిల్లాకో నవోదయ స్కూల్ను తెస్తాం.
జాతీయ పార్టీలుగా గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలకు కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇక్కడ అభ్యర్థులే కరువయ్యారు. ఎక్కడాదిక్కు లేక బీఆర్ఎస్ నుంచి తీసుకొని నిలబెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్, కడియం శ్రీహరి స్కూల్ నుంచి వచ్చిన వారే. నువ్వు గెలిచినా ఒక్కటే, నేను గెలిచినా ఒక్కటే అనే ఒప్పందంతో వారు పోటీకి దిగారు. వీరిద్దరినీ ప్రజలు గమనిస్తున్నరు. దేశ చరిత్రలో పెద్ద నమ్మక ద్రోహి కడియం శ్రీహరి. మచ్చలేని నాయకుడినని, నిబద్ధతతో పని చేస్తానని చెప్పుకునే కడియం శ్రీహరి రాజకీయ పునర్భిక్ష పెట్టిన బీఆర్ఎస్కు ఎంత నమ్మక ద్రోహం చేశాడో ప్రజలంతా గమనించారు. బీఆర్ఎస్కు కావ్య పోటీ కాదు. బీఆర్ఎస్కు కడియం, అరూరి చేసిన నమ్మక ద్రోహమే వారి ఓటమి, నా గెలుపునకు నాంది.