హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కొరడా ఝుళిపించింది. అక్రమ పద్ధతుల్లో ఫీజులు వసూలు చేస్తున్న 20కి పైగా కాలేజీలకు ఒక్కో ఫిర్యాదుపై రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది. గురునానక్ విద్యాసంస్థలోని రెండు కాలేజీలు, కేఎంఐటీకి చెందిన రెండు, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన మూడు, శ్రీఇందు విద్యాసంస్థలకు చెందిన రెండు కాలేజీలకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీచేసింది.
ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులకు మించి వసూలు చేసే కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని టీఏఎఫ్ఆర్సీ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా పలు కాలేజీలు టీఏఎఫ్ఆర్సీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశాయి. దీనిని సీరియస్గా తీసుకున్న టీఏఎఫ్ఆర్సీ సంబంధిత కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. కాగా, ఈ అంశంపై కాలేజీల యాజమాన్యాలు కోర్టుకెళ్లనున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం ఇరవైకి పైగా కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ జరిమానా విధించగా, త్వరలోనే మరికొన్నింటిపై చర్యలు తీసుకొనే అవకాశాలున్నట్టు తెలిసింది. మరికొన్ని ఫిర్యాదులు టీఏఎఫ్ఆర్సీ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వాటిపై విచారణ జరిపి అధిక ఫీజులు వసూలు చేసినట్టు తేలితే వాటికి సైతం జరిమానా విధిస్తామని టీఏఎఫ్ఆర్సీ అధికారులు పేర్కొంటున్నారు.