కాగజ్నగర్ నుంచి లక్నవరం పయనం
30 రోజుల్లో 306 కిలోమీటర్లు సంచారం
తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లోకి
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సంచరిస్తున్న పెద్దపులి మనదేనని అటవీ అధికారులు తేల్చారు. అది కాగజ్నగర్ అటవీ ప్రాంతానికి చెందినదని నిర్ధారించారు. 30 రోజులుగా సంచరిస్తున్న ఈ పులి ఈనెల 2న ములుగు జిల్లా లక్నవరంలో కనిపించింది. ఇది కాగజ్నగర్ అటవీప్రాంతం మీదుగా బెల్లంపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ఏటూరునాగారం, ములుగు, ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, కిన్నెరసాని, పాల్వంచ, పాడేరు అటవీ ప్రాంతాల్లో 306 కిలోమీటర్లు ప్రయాణించి లక్నవరం చేరుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 23న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో పులి సంచరించింది. అనంతరం ఏటూరునాగారం, భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ, బయ్యారం ప్రాంతాల్లో గుర్తించారు. ఈ నెల 2న సాయంత్రం ములుగు జిల్లా లక్నవరం ప్రాంతంలో పెద్దపులి అధికారులకు కనిపించింది. ఇక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. శనివారం మంథని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచిరించినట్టు సీఎఫ్వో సైదులు వెల్లడించారు.
పులుల సంచారం కనిపించినప్పుడు అటవీశాఖ అధికారులు టైగర్ ట్రాకింగ్ చేస్తారు. 5 నుంచి 8 మందితో ప్రత్యేక ట్రాకింగ్ సెల్ ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తారు. పులి ఎటువైపు వెళ్తుంది?, ఎక్కడ నీళ్లు తాగుతుంది?, రాత్రి వేళ ఎక్కడెక్కడ తిరుగుతుంది?, ఏం తింటుంది? తదితర అంశాలను ప్రత్యేక శాటిలైట్ లేదా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు.