మునుగోడు, అక్టోబర్ 28: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో శుక్రవారం రాత్రి మిత్రపక్షాల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళితవాడలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి, ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు.
దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. పేద పిల్లల చదువు కోసం పలు గురుకుల పాఠశాలలో స్థాపించి అందులో దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నదని తెలిపారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయిన రాజగోపాల్రెడ్డి డబ్బుతో ఓటర్లను కొనాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఓటు తోనే ఆయనకు గుణపాఠం చెప్పాలని కోరారు.