హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): జేపీ దర్గా, మక్కామసీదు మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి అడ్డంకులను తొలగించడానికి కృషి చేయాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్లో వక్ఫ్బోర్డు చైర్మన్ సలీం, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్తో కలిసి చారిత్రక భవనాల మరమ్మత్తులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మకా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వేగవంతంచేసి సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. జేపీ దర్గా, పహాడీషరీఫ్ దర్గా, మకా మసీదు, అనీసుల్ గుర్బాలో కొనసాగుతున్న పనులతోపాటు కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకుల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జేపీ దర్గాను సందర్శించి, దాని అభివృద్ధికి నిధులు మంజూరుచేసిన విషయం తెలిసిందే. దర్గా విస్తరణకు భూసేకరణ పనులను మైనారిటీ సంక్షేమ శాఖాధికారులతో సమన్వయం చేసుకొంటూ పూర్తిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్కు మంత్రి కొప్పుల ఫోన్లో ఆదేశాలిచ్చారు. నగరంలో వక్ఫ్బోర్డుకు చెందిన 11 ఆస్తులను నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ-టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇమామ్, మౌజంలకు నెలానెలా జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.