అసలు దేశంలో బొగ్గు కొరత ఉన్నదా? ఉంటే కేంద్రం ముందే ఎందుకు స్పందించలేదు? రాష్ర్టాలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? దేశంలో బొగ్గు నిల్వలు ఒక్క రోజుకు మాత్రమే సరిపోతాయని వార్తలు వచ్చిన తర్వాతే కేంద్రం ఎందుకు రాజకీయ దాడిని ఎంచుకున్నది? ఉద్దేశపూర్వకంగానే బొగ్గు సంక్షోభం సృష్టించాలని కేంద్రం కుట్ర చేసిందా? కొంతమంది ప్రైవేటు బొగ్గు దిగుమతిదారులవైపు విద్యుత్తు ఉత్పత్తి సంస్థలను బలవంతంగా మళ్లించే ప్రయత్నమా? ప్రైవేటు బొగ్గు దిగుమతిదారుల వద్ద పేరుకుపోయిన నిల్వలను క్లియర్ కావాలన్న ఆలోచనే ప్రస్తుత పరిస్థితికి సంక్షోభానికి కారణమా? వీటికి నిపుణులు ‘అవును’ అనే సమాధానం చెప్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉత్పత్తి సంస్థల వద్ద తగినన్ని బొగ్గు నిల్వలు లేకపోవడానికి కేంద్రం అనుసరించిన విధానం కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. విదేశీ బొగ్గును భారీగా నిల్వ చేసిన కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేవిధంగా కృత్రిమ కొరతను సృష్టించారనే వాదన వినిపిస్తున్నది. గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా విద్యుత్తు సరఫరాకు డిమాండ్ పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను అప్రమత్తం చేయకుండా, నిర్లప్తంగా వ్యవహరించడమూ ఇటువంటి అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. సంస్కరణల పేరుతో బొగ్గు ఉత్పత్తి సంస్థలపై కేంద్రం ప్రయోగిస్తున్న ఒత్తిడి, రాష్ర్టాలను అప్రమత్తం చేయకపోవడం తదితర ప్రస్తుత సంక్షోభానికి దారితీసిందనే చర్చ వినిపిస్తున్నది. మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ఇండియా, సింగరేణి, మహానది గనులు దేశీయంగా బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, ప్రైవేట్రంగంలోని పలు కార్పొరేట్ కంపెనీలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొని, విద్యుదుత్పత్తి సంస్థలకు విక్రయిస్తున్నాయి. కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్ల నేపథ్యంలో విధించిన లాక్డౌన్ల కారణంగా చాలా పరిశ్రమలు, కంపెనీలు నెలలపాటు మూతపడ్డాయి. దీంతో ఆ మేరకు విద్యుత్తు వినియోగం తగ్గింది. విద్యుదుత్పత్తిలో వినియోగించే బొగ్గుకు డిమాండ్ తగ్గడంతో కార్పొరేట్ కంపెనీలు దగ్గర నిల్వలు భారీగా పేరుకొపోయాయనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు ఇటీవల కాలంలో రెట్టింపయ్యా యి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల దగ్గర భారీగా పేరుకొపోయిన నిల్వలను అధిక ధరలకు అమ్మించేందుకు కీలకస్థానాల్లో ఉన్న కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలో బొగ్గు కొరత ఏర్పడటం, దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం చూపే స్థాయికి చేరడం వెనుక కొందరు వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు విమర్శలున్నాయి.
అప్పుపై ఇవ్వొద్దని ఆదేశాలు!
విదేశీ బొగ్గుతో పోల్చుకొంటే మన కోల్ఇండియా, సింగరేణి, మహానది సంస్థలు సరఫరా చేసే బొగ్గు ధరలు చాలా చౌక. పైగా ప్రభుత్వరంగ సంస్థలకు విద్యుదుత్పత్తి కంపెనీలకు ఉద్దెర ఇస్తాయి. తర్వాతి బిల్లుల్లో సర్దుబాటు చేసుకొంటాయి. అయితే, సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కరెంటు విషయంలో అనురించిన పద్ధతుల్లోనే.. అప్పుపై బొగ్గును సరఫరా చేయొద్దని ప్రభుత్వరంగ మైనింగ్ సంస్థలపై ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం. దీంతో పెద్దమొత్తంలో కొనుగోళ్లకు నగదు సమస్యను ఎదుర్కొంటున్న విద్యుదుత్పత్తి సంస్థలు బొగ్గు నిల్వలను తగ్గించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందనే వాదన వినిస్తున్నది. మరోవైపు, కరోనా వ్యాప్తి ఉధృతి తగ్గుముఖం పట్టడం, వివిధ కంపెనీల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకొంటుండంతో గత కొంతకాలంగా విద్యుత్తు సరఫరాకు డిమాండ్ పెరుగుతున్నది. వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్తు వినియోగం 20శాతం పెరిగినట్టు అంచనా. ఇలాంటి సందర్భాల్లో రాష్ర్టాలను అప్రమత్తం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. విద్యుత్తు సరఫరా డిమాండ్ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 170 థర్మల్ పవర్ప్లాంట్లలోని బొగ్గు నిల్వలు కరిగిపోయాయి. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో దాదాపు 11.6 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగం పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా బొగ్గు లభ్యత పెరగలేదు. దిగుమతి 1.4 మిలియన్ టన్నులు తగ్గింది. దీంతో సంస్థల దగ్గర ఉన్న నిల్వల్లో దాదాపు 7.5 మిలియన్ టన్నులు ఖర్చయినట్టు నిపుణులు చెప్తున్నారు.
అనవసర భయాలు సృష్టిస్తున్నారు
కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కేసింగ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: బొగ్గు కొరత, విద్యుత్తు సంక్షోభంపై అనవసర భయాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నాలుగు రోజులకు సరిపడా బొగ్గునిల్వలు ఉన్నాయని, కేంద్రం ఎప్పటికప్పుడు బొగ్గు సరఫరా చేస్తున్నదని తెలిపారు. ఢిల్లీలో విద్యుత్తు సంక్షోభం లేదన్నారు. కాంట్రాక్టు అయిపోతున్నందున గ్యాస్ సరఫరా ఆపేస్తామని గెయిల్ ఢిల్లీ డిస్కంలకు సమాచారం ఇవ్వడంవల్లే విద్యుత్తు సంక్షోభంపై అనుమానాలు తలెత్తి ఉండొచ్చన్నారు.
కండ్లు మూసుకుపోయిన కేంద్రం
ఆర్కే సింగ్ వ్యాఖ్యలపై సిసోడియా
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశంలో బొగ్గుకు తీవ్ర కొరత ఉందన్న వాస్తవాన్ని ఒప్పుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదని, కేంద్రం కండ్లు మూసుకుపోయాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డారు. కేంద్రం ఏ సమస్య వచ్చినా ఇదేలా వ్యవహరిస్తున్నదని, ఇది దేశానికి మంచిది కాదన్నారు. దేశంలో బొగ్గుకు కొరత లేదని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చెప్పడంపై సిసోడియా అసహనం వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ వేళ ఆక్సిజన్ కొరతపై కేంద్రం ఇలాగే వ్యవహరించిందన్నారు. ఆక్సిజన్కు కొరత ఉందని దవాఖానలు, రాష్ర్టాలు మొత్తుకొన్నా పట్టించుకోలేదని గుర్తుచేశారు.
పంజాబ్లో విద్యుత్తు కోతలు
చండీగఢ్: పలు రాష్ట్రాల్లో బొగ్గు కొరత ప్రభావం మొదలైంది. పంజాబ్లో విద్యుత్తు సరఫరా పరిస్థితి దిగజారింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13 వరకు రోజూ 3 గంటల పాటు విద్యుత్తు కోత విధిస్తామని పీఎస్పీసీఎల్ ప్రకటించింది. థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో వాటిని 50 శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు.