ఇప్పటికే దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అనేక అవార్డులు సొంతం చేసుకుంటోంది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సైతం ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. తాజాగా గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. గత ఏడాది కూడా తెలంగాణ ఆన్లైన్ ఎడిటింగ్లో నెంబర్ వన్గా నిలవడం విశేషం. అదే ఒరవడిని కొనసాగిస్తూ వరుసగా రెండో సారి కూడా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖను అభినందిస్తూ లేఖ రాసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఆన్లైన్ ఎడిటింగ్లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు లీడ్ రోల్ పోషిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తున్నది. 2020-21 వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం విషయమై ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్లైన్లోనే అందిస్తున్నది. ఈవిధంగా నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతంతో తమిళనాడు, 60 శాతంతో ఆంధ్ర ప్రదేశ్ దేశ్, 59 శాతంతో కర్ణాటక ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతానికి లోపే ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసి వెనుకబడ్డాయి. కాగా 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం పై నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్లో కూడా తెలంగాణ నెంబర్ వన్గా నిలవడం విశేషం.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయని, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాలు, మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ షిప్ మన పల్లెలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో సాధ్యమవుతుందని చెప్పారు.
చిన్న గ్రామపంచాయతీలకు కూడా కనీసం రూ.5 లక్షలు అందే విధంగా చూస్తున్నామన్నారు. ప్రపంచంలో, దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంప్ యార్డ్, స్మశాన వాటిక, కళ్లాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, హరిత హారం కింద మొక్కలు వచ్చాయన్నారు. నిరంతర పారిశుద్ధ్యం కొనసాగుతుండటం వల్ల పల్లెలు దేశానికి పట్టుకొమ్మలుగా మారాయని అన్నారు. అందుకే కరోనా వంటి ఉపద్రవాలను సైతం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కోగలిగిందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ప్రశంసలు అభినందనలు కురిపించడంతో సరిపెట్టుకోకుండా కాస్త నిధులు ఎక్కువగా ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా ప్రోత్సహించాలని ఎర్రబెల్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి ప్రతి ఫలాలు లభిస్తున్నాయని.. ఈసందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఇదేవిధంగా రానున్న కాలంలోనూ పని చేసి పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు తేవాలని మంత్రి ఎర్రబెల్లి వారికి విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, నిధులను సద్వినియోగం చేసుకుంటూ, ఆన్లైన్ ఆడిటింగ్ లో కూడా నెంబర్ వన్ గా నిలుస్తూ మన గ్రామ పంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగించవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి, ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను మంత్రి అభినందించారు.