హైదరాబాద్, జనవరి 11 : తెలంగాణ వ్యక్తికి అరుదైన అవకాశం లభించింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్ మహారాష్ట్రలోని కవి కులగురు కాళిదాస (కేకే)సంస్కృత యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన పాఠశాల విద్య మొత్తం నార్కట్పల్లిలోనే పూర్తిచేశారు. తర్వాత ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుంచి సంస్కృతంలో ఎంఏ, పీహెచ్డీ పూర్తిచేశారు. అనంతరం కేకే సంస్కృత వర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. ఇప్పటివరకు భారతీయ దర్శనం విభాగానికి డీన్గా వ్యవహరిస్తున్నారు. 2018, 2019, 2020 సంవత్సరాలకు గానూ మహాకవి కాళిదాస్ సంస్కృత్ సాధన అవార్డును అందుకొన్నారు. గులాబ్రావు మహారాజ్ జీవితచరిత్రపై ఆయన రాసిన మహాకావ్యానికి 2020లో సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకొన్నారు.
చాలా సంతోషంగా ఉన్నది
సంస్కృత యూనివర్సిటీకి వీసీగా ఎంపిక కావడం సంతోషంగా ఉన్నది. ఇది నేను ఊహించని పదవి. ఒక అధ్యాపకుడి జీవితంలో ఇంత కన్నా మించింది మరొకటి ఉండదు. యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 200కు పైగా కాలేజీలను అభివృద్ధిలోకి తెచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను. -ప్రొ. మధుసూధన్, వీసీ, కేకే సంస్కృత యూనివర్సిటీ