హైదరాబాద్: తెలంగాణ హరితశోభితంగా మారింది. సతతం హరితం అన్న నినాదానికి దిక్సూచీ అయ్యింది. పచ్చ పచ్చ అందాలతో తెలంగాణ రాష్ట్రం రమణీయంగా దర్శనమిస్తోంది. దట్టమైన అడవులు గ్రీనరీతో వెలిగిపోతున్నాయి. వరంగల్లోని అడవులు హరిత అందాలతో ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ హరిత సుందరంగా మారినట్లు ఐక్యరాజ్యసమితి పర్యావరణశాఖ అధిపతి, గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హెమ్ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపారు. దట్టమైన అడవులతో తెలంగాణ బ్యూటిఫుల్గా కనిపిస్తోందన్నారు. అతి తక్కువ సమయంలోనే తెలంగాణలో మూడు శాతం గ్రీనరీ పెరిగినట్లు ఎరిక్ తన ట్వీట్లో తెలిపారు. ఆ అద్భుత పచ్చటి అందాలను తిలకించండి అంటూ ఎరిక్ తన ట్విట్టర్లో వరంగల్ అడవులకు చెందిన వీడియోను పోస్టు చేశారు.
పచ్చదనమే టార్గెట్గా ప్రభుత్వం చేపడుతున్న హరితహారం రాష్ట్రాన్ని గ్రీనరీ హబ్గా మార్చేస్తున్నది. రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా మొక్కులు నాటుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా సాగుతున్న హరితహారం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పరవళ్లుతొక్కుతోంది. వరంగల్ అడవులకు చెందిన ఏరియల్ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ మోహన చంద్ర కూడా తన ట్విట్టర్లో పోస్టు చేశారు.