హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రైతులు ఇక ఏమాత్రం వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదని ప్రగతిభవన్ లో జరిగిన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో వారు చెప్పారు.
వివిధ వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ, మార్కెటింగ్శాఖ అధికారులు మాట్లాడుతూ తెలంగాణలో గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కేంద్రం త్వరగా తీసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా వానాకాలంలో ఉత్పత్తి అయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందన్నారు.
ఇటీవల రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, గంగుల కమలాకర్ కలిసినప్పుడు ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చెప్పారని అధికారులు గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్రం వద్ద ఐదేండ్లకు సరిపడా నిల్వలున్నాయని కేంద్ర మంత్రి తేల్చిచెప్పిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత వానాకాలంలో కూడా 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్మొహమాటంగా చెప్పిందన్నారు.
ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని అధికారులు తెలిపారు. దేశంలో కరువులు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ప్రజల అవసరాల దృష్ట్యా ధాన్యం నిల్వ చేయడం కేంద్ర ప్రభుత్వ విధి అని, రాష్ట్రాలు తమకు పంటలను కనీస మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి ఇవ్వడం వరకే రాష్ట్రాల బాధ్యత అని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే, కేంద్రమంత్రి గోయల్ మాత్రం ఇప్పటికే నిల్వలు ఉన్న దృష్ట్యా ఒక్క కిలో ధాన్యం కూడా కొనలేమని చెబుతున్నారని వివరించారు.
రాష్ట్రంలో కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా రైతు బంధు వంటి పంట పెట్టుబడి సాయం, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. తద్వారా సాగు గణనీయంగా పెరిగి, రైతులు పంటలు బాగా పండిస్తున్నారని సమావేశం అభిప్రాయపడింది. కేంద్రం ముందు చూపుతో వ్యవహరించి వ్యవసాయ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించాలని పేర్కొంది.
ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా ప్రోత్సహిస్తే బాగుండేదని సమావేశం వ్యాఖ్యానించింది. కానీ, కేంద్రం ఇలాంటివేమీ చేయకపోగా, ఆహార నిల్వలు పేరుకు పోతున్నాయని చెప్పి తన బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోజూస్తున్నదని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన దరిమిలా, ఇక వచ్చే యాసంగి కాలం నుండి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమే అనే అభిప్రాయం వ్యక్తమైంది. గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని, రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేస్తున్నారని, దీని ద్వారా సుమారు 1 కోటి 40 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందని, ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రాష్ట్ర రైస్ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉందని అధికారులు వివరించారు.
వీటి దృష్ట్యా పీడీఎస్ తదితర అవసరాల మేరకు, కేంద్రప్రభుత్వం నిర్ధారించిన కోటా మినహా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు వివరించారు.
వీటన్నింటి దృష్ట్యా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.
గతంలో కరోనా వల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసింది. కానీ, ఈ వర్షాకాలంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దారించిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను ఐకేపీ కేంద్రాల ద్వారా కోటా మేరకు మాత్రమే ధాన్యం సేకరణ జరగాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రైతులను చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్ని స్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది.