హైదరాబాద్: రైతు సంక్షేమం కోసం ఓ ట్రెండ్ సెట్టింగ్ పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రైతు బంధు స్కీమ్.. తెలంగాణ రైతుల్ని ధనవంతుల్ని చేస్తోంది. రైతు బంధు పథకం ద్వారా అందుతోన్న పంట పెట్టుబడి అన్నదాతల్లో అమితానందాన్ని నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు సంక్రాంతి శోభల్ని నింపుతోంది. ఈ పండుగ వేళ ఆన్లైన్లోనూ కేసీఆర్ రైతు బంధు స్కీమ్ దూసుకెళ్లుతోంది. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో.. ఇవాళ “రైతుబంధు కేసీఆర్” #RythubandhuKCR అనే హ్యాష్ ట్యాగ్ హోరెత్తిస్తోంది. ఆ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది.
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సాయం పంపిణీ ఈ రోజు రు.50 వేల కోట్లకు చేరుకుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబరాలు మిన్నంటాయి. ఇంత భారీ మొత్తంలో రైతులకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చిన చరిత్ర, ఘనత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అన్నం పెడుతున్న రైతుల్ని ఇంత ఆత్మీయంగా ఆదుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ గారి మానసపుత్రిక రైతుబంధు అని.. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రైతుల కోసం తీసుకొని వచ్చినందుకు కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదే క్రమంలో రైతు సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రతిపక్షాల వైఖరిని తూర్పారా పట్టారు. కేటీఆర్ ప్రసంగానికి నెటిజన్ల నుండి ట్విట్టర్లో భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.
#RythubandhuKCR హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఎన్నారైలు మొదలుకొని కొన్ని వేల మంది రైతుబంధు కార్యక్రమాన్ని, రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ట్విట్టర్లో #RythubandhuKCR హ్యాష్ ట్యాగ్ మొదటి స్థానంలో నిలిచి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. గత యేడేండ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పురోగతిని ఈ సందర్భంగా నెటిజన్లు ప్రస్తావించడం జరిగింది. రైతుబంధు కార్యక్రమం దేశంలో రైతు సంక్షేమానికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.