హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోకుండా ఒక యజమాని దానిని తాళ్లతో కట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సిరిసిల్ల శాంతినగర్కు చెందిన ఒక యజమాని కారును పొడవైన తాళ్లతో భవనం పైనున్న కాంక్రీట్ పిల్లర్లకు కట్టేశారు. దీంతో ఆ వీధిలో భారీగా వరద నీరు ప్రవహించినప్పటికీ ఆ కారు ఒక్క అంగుళంమైనా కదలలేదు.
ఒమర్ బినా అలీ మసూద్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ కారు ఓనర్ జీనియస్ అని నెటిజన్లు ప్రశంసించారు. వరదల్లో కారు కొట్టుకుపోకుండా కాపాడుకునేందుకు ఇదో మంచి ఉపాయమని ఒకరు అన్నారు. ఇకపై ప్రజలు తమ కార్లను తాళ్లతో పైకి లాగి టెర్రస్పై పార్క్ చేస్తారేమోనని మరొకరు వ్యాఖ్యానించారు. కష్ట సమయాల్లో ఇలాంటి ఆలోచనలు వస్తాయని మరొక నెటిజన్ చమత్కరించారు.