రంగారెడ్డి, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ పారిశ్రామిక రంగంలో నూతన శకం మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా అనువైన ప్రాంతంగా ఉన్న ఈ జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎంతోమంది వ్యాపార, పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రియల్ పార్కులు, హార్డ్వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మెగా ఉత్పత్తి పరిశ్రమలతోపాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున నెలకొల్పారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా పారిశ్రామిక రంగంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది. అంతేకాకుండా అనుమతి వస్తుందా?.. రాదా?.. అనేది కూడా గ్యారంటీ ఉండేది కాదు. కానీ టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోగా అనుమతులు లభిస్తుండటంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు క్యూ కడుతున్నాయి. అంతేకాకుండా పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో కూడా పరిశ్రమలను నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. భారీ, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక వసతులను కల్పించడంతోపాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పట్టించుకోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సమస్యలపై.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఓ ఫెసిలిటేషన్ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అండగా కౌన్సిల్
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. గతంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వహాకులు ఏదైనా వస్తువును ఉత్పత్తి చేసి భారీ పరిశ్రమలకు అందజేసినట్టయితే సదరు పరిశ్రమల నుంచి డబ్బులు వచ్చేందుకు చాలా సమయం పట్టేది. విక్రయించిన వస్తువుల ద్వారా డబ్బు వస్తేనే మళ్లీ ఉత్పత్తి చేసే పరిస్థితి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలది. అయితే సరఫరా చేసిన వస్తువులు, సేవలకు అందజేయాల్సిన డబ్బులు ఏండ్లకొద్ది పెండింగ్లో ఉండటంతో నిర్వహించలేక అప్పుల్లో కూరుకుపోయి చాలా చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యమిస్తూనే, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అండగా నిలుస్తున్నది. ఇందుకుగాను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి రీజియన్, వరంగల్ రీజియన్గా రెండు ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి రీజియన్లో రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలున్నాయి. ఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్కు రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి రీజియన్లోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు ఉత్పత్తి చేసిన వస్తువులు విక్రయం, అందించే సేవలకుగాను నిర్ణీత గడువులోగా డబ్బులు అందనట్టయితే కౌన్సిల్లో ఫిర్యాదు చేయవచ్చు.
ఇప్పటివరకు రూ.97.08 కోట్ల బకాయిలు వసూలు
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమదారులు కొనుగోలుదారులకు వస్తువులు లేదా సేవలను అందించిన దానికి రావాల్సిన డబ్బులు 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిర్ణీత గడువులోగా చెల్లించనట్టయితే ఫెసిలిటేషన్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అనంతరం సంబంధిత కొనుగోలుదారులకు కౌన్సిల్ ఫిర్యాదును అందజేస్తుంది. ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా సెటిల్ చేసుకోలేనట్టయితే ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసి, కౌన్సిల్లో చర్చించనున్నారు. డబ్బులు చెల్లించనట్టయితే జరిగే పరిణామాల గురించి కొనుగోలుదారులకు కౌన్సిల్ వివరిస్తుంది. అయినప్పటికీ కొనుగోలుదారులు చెల్లించకుండా ఉన్నత న్యాయస్థానానికి వెళ్లినట్టయితే ముందుగానే 75 శాతం బకాయి డబ్బును కోర్టుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటైన అనంతరం భారీ పరిశ్రమల నిర్వాహకులు 60 రోజుల్లోనే సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు డబ్బులను అందజేస్తున్నారు. ఒకవేళ ఇంకా ఆలస్యమైతే వడ్డీతోసహా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేండ్లలో ఇప్పటివరకు 34 కౌన్సిల్ సమావేశాలు జరగగా, 641 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 250 దరఖాస్తులను పరిష్కరించి రూ.97.08 కోట్ల బకాయిలను రాబట్టి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు కౌన్సిల్ అందజేసింది. ఇందులో పరస్పర అంగీకారంతో 120 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు భరోసా వచ్చింది
ఫెసిలిటేషన్ కౌన్సిల్తో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు భరోసా ఏర్పడింది. ఎంఎస్ఈల నుంచి వస్తువులను, సేవలను పొందే భారీ, ఇతర పరిశ్రమల నిర్వాహకుల్లో భయం వచ్చింది. నిర్ణీత గడువులోగా వారే బకాయిలను చెల్లిస్తున్నారు. రీజియన్ పరిధిలో పెండింగ్ బకాయిలున్న ఏదేని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు నేరుగా కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు.
-రాజేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి రీజియన్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ చైర్మన్
ఫెసిలిటేషన్ కౌన్సిల్ మాకు సరైన ప్లాట్ఫాం
గతంలో మా సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటుతో మాకు సరైన ప్లాట్ఫాం అందుబాటులోకి వచ్చింది. పెండింగ్ బకాయిలకు సంబంధించి నేరుగా ఫిర్యాదు చేస్తున్నాం. నిర్ణీత గడువులోగా మాకు డబ్బులందుతున్నాయి. మా పరిశ్రమకు ఏడాదిగా పెండింగ్లో ఉన్న రూ.10 లక్షల బకాయిలు ఫెసిలిటేషన్ కౌన్సిల్ జోక్యంతో 15 రోజుల్లో వసూలయ్యాయి.
–షాలిని అగర్వాల్, నీమస్ ఎంటర్ప్రైజెస్