Srinivas Goud | తెలంగాణ సంస్కృతిలో భాగమైన మన బతుకమ్మ, బొడ్డెమ్మతో పాటు పేరిణి నృత్యం వల్ల దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత వచ్చిందని.. గొప్ప పేరు వచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ప్రముఖ కూచిపూడి నర్తకి డా. పద్మజా రెడ్డి ‘కాకతీయం’ నృత్య కళా రూపంపై రూపొందించిన వాల్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… కాకతీయం పేరుతో కాకతీయుల కాలం నాటి నృత్య కళారూపం పై అద్భుతమైన పరిశోధనలు నిర్వహించిన డా. పద్మజా రెడ్డి నేతృత్వంలో సుమారు 100 మంది కళాకారులతో కలసి కాకతీయం డాన్స్ బ్యాలెట్ ను డిసెంబర్ 26న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రదర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుత శిల్పా కళా వైభవం రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపునకు కృషి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్ల తెలంగాణ ఆర్కియాలజీ, టూరిజం శాఖల కృషి వల్ల రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 170 దేశాల నుండి బెస్ట్ టూరిజం విలేజ్ కోసం వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహించిన పోటీల్లో ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి గాంచిన పోచంపల్లికి ప్రపంచంలోనే బెస్ట్ టూరిజం విలేజ్గా గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
నృత్య రత్నావళిలో పేర్కొన్న నృత్య రూపకాలపై కాకతీయం పేరుతో పరిశోధన చేసి ప్రజలకు అర్థం అయ్యేరీతిలో డా. పద్మజా రెడ్డి నృత్యాలను రూపొందించి ప్రదర్శన నిర్వహించటం ఎంతో అభినందనీయమన్నారు. ఆమె విస్తృతమైన పరిశోధనలు చేసి అనేక దేవాలయాలలో (వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు) విస్తరించి ఉన్న వివిధ శిల్పాలను అధ్యయనం చేయడం ద్వారా “నృత్త రత్నావళి” పుస్తకంలోని సైద్ధాంతిక నృత్య భావన వివరాలను దృశ్య కళారూపంగా ఆవిష్కరించి నేటి యువతకు అందించటం గొప్ప విషయమన్నారు. డా. పద్మజా రెడ్డి కాకతీయం కళా రూపం పార్ట్ 1 లో (2017) బ్రమరి , కంధుక నృత్యం, కోలాట్టం, లాస్యంగము వంటి అంశాలపై ప్రదర్శించారన్నారు. అలాగే కాకతీయం పార్ట్ 2 (2021) లో గొండలి, రసకం, చరణ, పేరిణి, శివ ప్రియుల భావనలపై కళా రూపాల ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.