హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు సత్పలితాలనిస్తున్నాయని అయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు పెరిగి రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని అయన అన్నారు. తెలంగాణ లో 2014-15 సంవత్సరంలో 1,24,104 రూపాయల తలసరి ఆదాయం, 2020-21 సంవత్సరంలో 2,37,632 రూపాయలకు పెరిగిందని అయన తెలిపారు. 2020-21 సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం కేవలం 1,00,829 రూపాయలు మాత్రమే నమోదు అయిందని అయన తెలిపారు.
పల్లె ప్రగతి, వివిధ గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా పల్లెల రూపు రేఖలు మారాయని అయన అన్నారు. ప్రతినెల ఎలాంటి ఆటంకం లేకుండా గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం కింద 100 శాతం ఆడిటింగ్ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని అయన తెలిపారు. అంతేకాకుండా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం అగ్రగామిగా ఉందని అయన అన్నారు.
కరోనా నుండి త్వరగా కోలుకుంటున్నానని డాక్టర్ల సూచనల మేరకు హోం ఐసొలేషన్లో ఉన్నానని, మరికొన్ని రోజుల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.