వరంగల్: ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. జనవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన భద్రత, లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్, సీసీ కెమెరాలు, భక్తులకు అన్నదానం వంటి అనేక వసతుల కల్పనపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. రూ.కోటితో ఐనవోలులో శాశ్వత ప్రాతిపదికన పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు.
ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చరిత్రాత్మకమైనది.. మహిమాన్వితమైనది. నేను కూడా ఈ దేవాలయాన్ని తరుచూ దర్శిస్తూ ఉంటాను. ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు జరగాలి. 700 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన దేవాలయం ఇది. ఈ దేవాలయ చరిత్రను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. దేవాలయాన్ని రక్షించి, సంరక్షించుకోవాలి. పారిశుద్ధ్యం, మంచినీరు, స్నాన ఘట్టాలు, విద్యుత్ వంటి సదుపాయాలను మరింత అభివృద్ధి పరచాలి.. అని మంత్రి తెలిపారు.
పున్నేలు క్రాస్ నుండి ఐనవోలు దేవాలయం వరకు రోడ్డు ను డబుల్ రోడ్డుగా మరింత అభివృద్ధి పరచాలి. స్వాగత తోరణాలు అద్భుతంగా ఉన్నాయి. బైపాస్ రోడ్డు పూర్తి చేస్తే.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. నాయి బ్రాహ్మణులకు పర్మినెంట్ అవకాశం ఉంటే బాగుంటుంది. ఒక అతిథి గృహం నిర్మించాలి. వీఐపీలకు సదుపాయంగా ఉంటుంది. జాతర సమయంలో వచ్చే ఉద్యోగులకు సదుపాయాలు కావాలి. మండలం అయింది. మండలంలో ఉండే మౌలిక సదుపాయాలు కల్పించాలి. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలి. సులభ్ కాంప్లెక్స్ ల నిర్మాణం. మినీ ఫంక్షన్ హాల్ వంటివి ప్రణాళికాబద్ధంగా అమలు చేయాల్సి ఉంది.. అని మంత్రి స్పష్టం చేశారు.
పేరుకే 3 లేదా 4 రోజులే అయినా జాతర 2 నుంచి 3 నెలల పాటు జరుగుతుంది. ప్రతి నిత్యం ఇక్కడకు భక్తులు వస్తూనే ఉంటారు. అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఒక అధికారికి పూర్తి బాధ్యతలు అప్పగించండి. చిన్న చిన్న భాగాలుగా జాతర ప్రాంతాన్ని విభజించి, ఆయా భాగాలకు బాధ్యులను నియమించాలి. అనుభవజ్ఞులైన అధికారులను ఇక్కడ విధుల్లో నియమించాలి. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా పరీక్షా కేంద్రాలను పెట్టండి. టీకాలు వేయడానికి సిబ్బంది ఉండాలి. మాస్కులను ధరించాలి. ఆ విధంగా ప్రజలని చైతన్య పరచాలి. మాస్కులు ధరించని వాళ్లకు జరిమానాలు విధించండి.. అని మంత్రి తెలిపారు.
ఆలయ డోనర్లను బాగా చూసుకోవాలి. వాళ్ళు మన దేవాలయాలకు దాతలు. వాళ్ళని గౌరవించుకోవాలని, సేవా, భక్తి భావాలతో ఇక్కడ అధికారులు, సిబ్బంది పని చేయాలి. జాతరకు ముందుగానే, ఆలయాన్ని, ఆలయ ప్రాంగణంని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. అన్ని శాఖలను సమన్వయం చేసే బాధ్యత కలెక్టర్ తీసుకోవాలి. ఇప్పటికే గత సమీక్షలో ఇచ్చిన హామీల మేరకు, నిధులు మంజూయ్యాయి. వాటి పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి.. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ఆలయ అభివృద్ధి దాతలను సగౌరవంగా చూడాలి. వారికి ఎలాంటి లోట్లు రానివ్వవద్దు. భక్తులకు మంచి దర్శనం ఇప్పించడం లక్ష్యంగా అధికారులు, పూజారులు, ఆలయ అధికారులు పని చేయాలి – వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
అంతకుముందు మంత్రి ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఈవో, సిబ్బంది, పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో మొక్కులు తీర్చుకున్న మంత్రి ఎర్రబెల్లి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.